విరసం నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఏపీ కర్నూలులోని విరసం కార్యదర్శి పాణి ఇంట్లో (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పోలీసు బందోబస్తుతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
గీత ఆశ్రమం రోడ్డులోని వరలక్ష్మి ఇంట్లో దిల్లీ నుంచి వచ్చిన సీఐ మరో నలుగురు సిబ్బంది ఆమెను విచారిస్తున్నారు. సుమారు మూడు గంటల నుంచి వరలక్ష్మిని అధికారులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు విశాఖ పిఠాపురంకాలనీలో న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులోని న్యాయవాది కె.ఎస్.చలం ఇళ్లలోనూ.. ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. గతేడాది నవంబరులో విశాఖ, గుంటూరు జిల్లాల్లో కేసు నమోదైంది. ఇందులో భాగంగానే మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలపై వరలక్ష్మి సహా 27 మందిపై కేసు నమోదు చేశారు. కేసును గతంలోనే ఎన్ఐఏకు ఏపీ ప్రభుత్వం అప్పగించింది.