ఎన్హెచ్ఎం ఉద్యోగులకు పీఆర్సీ రెగ్యులరైజేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగులు విన్నవించారు. హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో ఆయనకు పలువురు ఎన్హెచ్ఎం ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు.
ఈనెల 11న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు పెంచుతున్నట్లు జీవోలు కూడా విడుదల చేశారన్నారు. కానీ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే ఎన్హెచ్ఎం జీతాల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించకపోవడం విచారకరమని వినతి పత్రంలో పేర్కొన్నారు.
నేషనల్ హెల్త్ మిషన్.. కేంద్ర ప్రభుత్వ పథకం అనే పేరుతో.. తమకు గత పీఆర్సీలలో కూడా వేతనాలు పెంచకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఎం స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని వారు ఆరోపించారు. తమకు పీఆర్సీ వర్తింపజేసే విధంగా.. పీఆర్సీ కమిషన్ సూచించిన రెగ్యులర్ ఉద్యోగి బేసిక్ పేను, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనంతో ఇచ్చే విధంగా కృషి చేయాలని వినతిపత్రంలో కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఇదీ చూడండి: బీటా వేరియంట్పై వ్యాక్సిన్లు ప్రభావవంతమేనా?