MP RRR Letter to CID: ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఇవాళ విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. దిల్లీ వెళ్లాక తన ఆరోగ్యం బాగాలేదని పేర్కొన్నారు. తనపై నమోదైన కేసుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా.. తనకు 4 వారాల గడువు ఇవ్వాలని సీఐడీని కోరారు.
రఘురామకు సీఐడీ నోటీసులు.. ఏం జరిగిందంటే..?
CID Notice To RRR: జనవరి 12వ తేదీన హైదరాబాద్లోని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి అధికారులు వెళ్లిపోయారు.
నోటీసులపై స్పందించిన రఘురామ
సీఐడీ నోటీసులపై స్పందించిన ఎంపీ రఘురామ.. రాష్ట్ర ప్రభుత్వం తనపై కొత్తగా కేసులు పెట్టిందన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండగ దృష్ట్యా.. తన సొంత నియోజకవర్గం నరసాపురం పర్యటనకు.. గురువారం రానున్నట్లు ప్రకటించారు. అయితే సీఐడీ నోటీసులు, తదితర కారణాల నేపథ్యంలో భీమవరం రావట్లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: TS High Court : రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి : హైకోర్టు