ఇంటి నుంచి బయటికి ఇంకా అడుగుపెట్టని తన కూతురికి దగ్గు, ఆయాసం రావడంతో వైద్యులను సంప్రదించింది మోనీషా. బయట వ్యర్థాలను కాలుస్తుంటే, వాటి నుంచి వచ్చే పొగ ఈ అనారోగ్యానికి కారణమని తెలుసుకుంది. అదే ఆమెను ఆలోచించేలా చేసింది. ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను తగ్గించగలిగితే, ఈ సమస్యను కొంతైనా అదుపు చేయొచ్చు అనుకుంది. దాంతో ఇంటి చుట్టుపక్కలవారికి చిన్నచిన్నగా ఈ అంశంపై అవగాహన కలిగించడం ప్రారంభించింది. దాంతోపాటు వంటింటి వ్యర్థాలతో పెరటితోటను పెంచడమే కాదు, వాటి నుంచి పండే తాజా కూరగాయలతో ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉండొచ్చని చేసి చూపింది.
తాము ఉంటున్న సముదాయంలో గృహిణులందరినీ ఓ గ్రూపుగా చేసింది. వ్యర్థాలను ఎరువుగా మార్చడం, వాటితో మొక్కల పెంపకం వంటి వాటిపై వర్క్షాపులు నిర్వహించేది. నాలుగేళ్లు శ్రమ పడ్డాక చుట్టుపక్కల వారంతా ఈ విధానాన్ని పాటించడం మొదలుపెట్టారు. వారిలో కొందరి వలంటీర్లుగా మారేలా స్ఫూర్తి కలిగించింది మోనీషా. ఈకో బజార్స్, ఈకో అవేర్నెస్ వర్క్షాప్స్ నిర్వహించేలా శిక్షణనిచ్చింది. అలా 2009లో ఈ గ్రూపు ‘రుర్ (రెడ్యూసింగ్, రీయూజింగ్, రీసైక్లింగ్)’ పేరుతో 100 సైట్లలో 200కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. బయో కంపోస్టర్స్ ద్వారా దాదాపు 30 లక్షలమంది ఈ పద్ధతిపై అవగాహన పొంది, ఈ 12 ఏళ్లలో ఏటా 750 టన్నులకు పైగా వ్యర్థాలను రీసైకిల్ చేస్తున్నారు. వీరిలో కొందరు తాము తయారు చేసిన కంపోస్ట్ను విక్రయించే స్థాయికీ ఎదిగారు.
రీసైకిల్గా...
ఇదే కాక వేస్ట్ మేనేజిమెంటు సొల్యూషన్స్ దిశగా మోనీషా ఆలోచించింది. ‘రుర్ గ్రీన్ లైఫ్’ పేరుతో వ్యర్థాలను రీసైకిలింగ్ చేసి కొత్త ఉత్పత్తుల తయారీ ప్రారంభించింది. ఇందుకోసం కమ్యూనిటీలు, పాఠశాలలు, ముంబయిలోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, రిటైల్స్టోర్స్ సహా రిలయన్స్ ఫ్రెష్లోనూ ‘గో గ్రీన్ విత్ టెట్రాప్యాక్’ పేరిట అవగాహనా కార్యక్రమాలు మొదలుపెట్టింది. వాడేసిన టెట్రా ప్యాకెట్ల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సేకరించిన ప్యాకెట్లను ముందు గుజ్జులా చేసి, ఆ మిశ్రమంతో షీట్లను చేయించింది. వాటితో స్కూల్ బెంచీలు, కుర్చీలు, ఆఫీసు ఫర్నీచరు రూపొందించింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున తయారీ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో రుర్ వలంటీర్లూ యథాశక్తి సాయం చేశారు. ప్రస్తుతం ముంబయిలోని పలు పాఠశాలలు, కార్యాలయాలు, కాలేజీలు ఈ టెట్రాప్యాక్ ఫర్నిచర్ను వినియోగిస్తున్నాయి. ‘మా నాన్న ఇంజినీర్. సొంత వ్యాపారం చేసేవారు. అన్నయ్యా ఇదే రంగంలో ఉండటంతో నేనూ అదే చదవాలనుకునేదాన్ని. నాన్నతో కలిసి ఫ్యాక్టరీకి ఎళ్తే యంత్రాలను చూసి చాలా ఆసక్తి కలిగేది. నేను కూడా వ్యాపారిని కావాలనుకున్నా. పర్యావరణ రక్షణ, నా నా లక్ష్యం... రెండింటినీ కలిపే దిశగా ఈ ఫర్నీచర్ తయారీ ప్రారంభించా. ఇప్పుడు ప్రజల్లో దీనిపట్ల చాలా అవగాహన పెరుగుతుండటం సంతోషంగా ఉందంటోంది మోనీషా.
ఇదీ చదవండి: Yadadri Temple: యాదాద్రిలో భక్తుల కిటకిట.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..