కేంద్ర ప్రభుత్వ నిధులతో... తెలంగాణ సర్కార్ ఎంజాయ్ చేస్తుందన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎవరిని ఎవరు ఆదుకుంటున్నారో రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే పన్నుల గణాంకాలే వెల్లడిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ దోమలగూడలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్.. బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతుక పేరుతో ప్రచారం చేస్తున్న భాజపా అభ్యర్థి రాంచందర్ రావు ఆరేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రం అడుగడుగునా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు నోరుమెదపరని ప్రశ్నించారు.
రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో 91 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జలవిహార్లో పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి.. భాజపా రాష్ట్ర నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కరోనా తర్వాత ప్రధాని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో రాష్ట్రానికి శూన్యహస్తమే మిగిలిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ వివరించారు. ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులతో తెరాసకు పేగు బంధం ఉందన్న కేటీఆర్ పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు.
ఇదీ చదవండి: కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్ రెడ్డి