Harish Rao Review: పది రోజుల్లో నిమ్స్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన టెండర్ పనులను పూర్తి చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై మంత్రి హరీశ్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రుల విస్తరణ: ఈ సందర్భంగా వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని హరీశ్రావు అధికారులకు స్ఫష్టం చేశారు. వరంగల్ హెల్త్ సిటీని దసరా నాటికి ప్రారంభించుకునేందుకు వీలుగా సిద్ధం చేయాలన్నారు. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలన్న మంత్రి.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రులను విస్తరించుకునేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000 పడకల బిల్డింగ్కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీ వేగవంతం చేయాలి: ప్రారంభానికి సిద్దంగా ఉన్న డయాలిసిస్ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభించి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డయాలసిస్ కేంద్రాలను మూడు క్లస్టర్స్గా విభజించి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకు పరిశీలన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో బస్తీ దవాఖానాలను పెంచాలన్న మంత్రి హరీశ్రావు.. ప్రస్తుతం రాష్ట్రంలో 363 బస్తీ దవాఖానాలు సేవలు అందిస్తుండగా ఆ సంఖ్యను 500లకు పెంచనున్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నాటికి 3206 పల్లె దవాఖానాలు పూర్తి స్థాయిలో పని చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరం అయిన 321 పోస్టులు భర్తీ చేయాలని స్ఫష్టం చేశారు. కంటి వెలుగు పరీక్షల్లో భాగంగా ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీ వేగవంతం చేయాలని హరీశ్రావు అదేశించారు.
ఇవీ చదవండి: