సికింద్రాబాద్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని లాడ్జ్, హోటళ్లలో పనిచేసే వలస కార్మికులంతా గోపాలపురం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి కోసం సికింద్రాబాద్ గణేష్ ఆలయం నుంచి గోపాలపురం పీఎస్ వరకు క్యూ కట్టారు.
పోలీస్ స్టేషన్లో తమ వివరాలు నమోదు చేసుకుని రైళ్లలో తమ ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వారందరినీ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ వివరాలు సేకరిస్తున్నారు.
బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు లాక్డౌన్ వల్ల ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం ఆదేశాలివ్వగా.. వారి ఇళ్లకు పయనమవుతున్నారు.