ETV Bharat / state

కొవిడ్‌తో తల్లిదండ్రుల మృత్యువాత.. దిక్కుతోచని స్థితిలో పిల్లలు

author img

By

Published : May 21, 2021, 6:52 AM IST

పిల్లలకు అమ్మానాన్న కొండంత అండ. ఎక్కడా లేని భరోసా. కటిక దారిద్య్రం వెంటాడుతున్నా సరే తల్లిదండ్రులు పక్కనున్నారంటే ఆ ధీమా వేరు. పిల్లలపై పగబట్టినట్లుగా తాజాగా కరోనా మహమ్మారి ఎంతో మంది కన్నవారిని కబళించింది. ఆప్యాయతకు ఆలవాలమైన అమ్మ లేక.. ఆపద సమయంలో నేనున్నానని ధైర్యమిచ్చే నాన్న దూరమై వందల మంది పిల్లలు చేష్టలుడిగి చూస్తున్నారు. కొందరికి అమ్మమ్మ, తాతయ్యల ఆసరా దొరికినా.. మరికొందరికి బాబాయ్‌లో, మేనమామలో చేయూతనిచ్చినా.. కన్నవారి లేని లోటు తీర్చలేనిది. కొన్నిచోట్ల మంచాన పడ్డ వృద్ధుల పోషణ భారం కూడా చిన్నారులపైనే పడటం మరో విషాదం. ఇప్పటివరకు సాగిన చదువులు మున్ముందు ఎలా అన్న ప్రశ్న పలువురిని వేధిస్తోంది. ఇక తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారులు ఎందరో.. ఎందరెందరో!

కొవిడ్‌తో తల్లిదండ్రుల మృత్యువాత..
కొవిడ్‌తో తల్లిదండ్రుల మృత్యువాత..

రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏప్రిల్‌ 10 నాటికి 1,752 మంది చనిపోగా... ఈ 40 రోజుల్లోనే ఆ సంఖ్య 3,060కి చేరింది. ప్రతి రోజూ దాదాపు 25 మంది మృత్యువాతపడుతున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు కొద్ది రోజుల వ్యవధిలో కొవిడ్‌ కాటుకు బలయ్యారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కొద్ది నెలల ముందే వేరే వ్యాధితో అర్ధాంతరంగా తనువు చాలించింది. తొమ్మిదో తరగతిలోకొచ్చిన చిన్న కుమార్తె(13) ఒంటరిదైంది. ఇద్దరు మేనమామలు, పెద్దమ్మలు అండగా నిలిచారు. ఆ బాలికకు వివాహం అయ్యే వరకు పింఛను అందుతుంది. సాధారణంగా సర్వీస్‌లో ఉండగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే పిల్లల్లో ఒకరికి కొలువు ఇస్తారు. అయితే వయసు 18 సంవత్సరాలు దాటాలి. ఈ అమ్మాయి వయసు 13 కావడంతో ప్రభుత్వం ఏమైనా మినహాయింపులు ఇస్తుందా? పదో తరగతి పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిస్తుందా అన్నది ప్రశ్న.
అమ్మమ్మ, తాతయ్యల చెంతకు..
వనపర్తికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితోపాటు ఆయన భార్య కూడా మూడు రోజుల వ్యవధిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఈ ఏడాది బీటెక్‌ పూర్తవుతుంది. చిన్న కుమార్తె మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అమ్మానాన్నలు శాశ్వతంగా దూరం కావడంతో నాగర్‌కర్నూల్‌ సమీపంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల చెంతకు చేరారు. ‘‘నాకు 70 సంవత్సరాలు... మెడికల్‌ బిల్లులు, పింఛను, మనవరాలికి ఉద్యోగం తదితర వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలంటే నా వల్ల అవుతుందా అన్నది భయంగా ఉంది’ అని ఆ అమ్మాయిల తాతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని అందాల్సిన సాయం తమకు లభించేలా చూడాలని ఆయన కోరారు.

ముగ్గురు పిల్లల భారం ఇక ఈమెపై..

పుష్ప

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బోయిన శేషు(35) ఇటీవల కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. చికిత్స కోసం రూ.లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. ఆయనకు భార్య పుష్పతోపాటు ఆరు, నాలుగు సంవత్సరాల వయసున్న అమ్మాయిలు, ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు మరింత కష్టాల్లో కూరుకుపోయింది. ముగ్గురు పిల్లల పోషణ బాధ్యత పుష్పపై పడింది. ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు.

అమ్మను కూడా కోల్పోయి..
ఊహ తెలియని వయసులో తండ్రిని కోల్పోయి, తల్లి సంరక్షణలో పెరుగుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలకు కరోనా మహమ్మారి ఇప్పుడు అమ్మనూ దూరం చేసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన కవితకు ఇద్దరు కుమార్తెలు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె కూలీనాలీ చేసుకుంటూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద అమ్మాయి మౌనిక హోటల్‌ మేనేజ్‌మెంట్, చిన్నమ్మాయి యామిని ఇంటర్‌ చదువుతున్నారు. ఈనెల 5న కవిత(52)ను కరోనా బలి తీసుకుంది. దీంతో ఇద్దరికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. పక్షవాతంతో మంచానికే పరిమితమైన నానమ్మ, తాతకు సేవలు చేస్తూ ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబం గడిచేదెలా? చదువులు సాగేదెలా? అన్నది వారిని తీవ్రంగా కలచివేస్తోంది.

సాయం కావాలంటే ఫోన్‌ చేయండి

కొవిడ్‌ సమయంలో అనాథలుగా మారిన పిల్లల సంరక్షణ కోసం శిశు సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. తల్లి లేదా తండ్రి చనిపోయిన వారిని ఆదుకుంటోంది. ప్రభుత్వ పథకాల సహాయం కింద కుటుంబ అవసరాలు తీర్చడం, పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పించడం, ఉన్నత చదువుల కోసం గురుకులాల్లో ప్రవేశాలు కల్పించడం లాంటి వాటిపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని అసహాయ చిన్నారుల సంరక్షణ, సహాయం కోసం 040-23733665 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు)కు ఫోన్‌ చేయవచ్చు. 1098 ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (24 గంటలు) కూడా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ డి.దివ్య ఏర్పాటు చేశారు. వచ్చే కాల్స్‌ను నిరంతరం పర్యవేక్షించేందుకు సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

ఇదీ చూడండి: 2డీజీ ఔషధం పంపిణీ ప్రారంభం కాలేదు.. మోసపోవద్దు: కేటీఆర్​

రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏప్రిల్‌ 10 నాటికి 1,752 మంది చనిపోగా... ఈ 40 రోజుల్లోనే ఆ సంఖ్య 3,060కి చేరింది. ప్రతి రోజూ దాదాపు 25 మంది మృత్యువాతపడుతున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు కొద్ది రోజుల వ్యవధిలో కొవిడ్‌ కాటుకు బలయ్యారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కొద్ది నెలల ముందే వేరే వ్యాధితో అర్ధాంతరంగా తనువు చాలించింది. తొమ్మిదో తరగతిలోకొచ్చిన చిన్న కుమార్తె(13) ఒంటరిదైంది. ఇద్దరు మేనమామలు, పెద్దమ్మలు అండగా నిలిచారు. ఆ బాలికకు వివాహం అయ్యే వరకు పింఛను అందుతుంది. సాధారణంగా సర్వీస్‌లో ఉండగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే పిల్లల్లో ఒకరికి కొలువు ఇస్తారు. అయితే వయసు 18 సంవత్సరాలు దాటాలి. ఈ అమ్మాయి వయసు 13 కావడంతో ప్రభుత్వం ఏమైనా మినహాయింపులు ఇస్తుందా? పదో తరగతి పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిస్తుందా అన్నది ప్రశ్న.
అమ్మమ్మ, తాతయ్యల చెంతకు..
వనపర్తికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితోపాటు ఆయన భార్య కూడా మూడు రోజుల వ్యవధిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఈ ఏడాది బీటెక్‌ పూర్తవుతుంది. చిన్న కుమార్తె మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అమ్మానాన్నలు శాశ్వతంగా దూరం కావడంతో నాగర్‌కర్నూల్‌ సమీపంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల చెంతకు చేరారు. ‘‘నాకు 70 సంవత్సరాలు... మెడికల్‌ బిల్లులు, పింఛను, మనవరాలికి ఉద్యోగం తదితర వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలంటే నా వల్ల అవుతుందా అన్నది భయంగా ఉంది’ అని ఆ అమ్మాయిల తాతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని అందాల్సిన సాయం తమకు లభించేలా చూడాలని ఆయన కోరారు.

ముగ్గురు పిల్లల భారం ఇక ఈమెపై..

పుష్ప

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బోయిన శేషు(35) ఇటీవల కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. చికిత్స కోసం రూ.లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. ఆయనకు భార్య పుష్పతోపాటు ఆరు, నాలుగు సంవత్సరాల వయసున్న అమ్మాయిలు, ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు మరింత కష్టాల్లో కూరుకుపోయింది. ముగ్గురు పిల్లల పోషణ బాధ్యత పుష్పపై పడింది. ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు.

అమ్మను కూడా కోల్పోయి..
ఊహ తెలియని వయసులో తండ్రిని కోల్పోయి, తల్లి సంరక్షణలో పెరుగుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలకు కరోనా మహమ్మారి ఇప్పుడు అమ్మనూ దూరం చేసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన కవితకు ఇద్దరు కుమార్తెలు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె కూలీనాలీ చేసుకుంటూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద అమ్మాయి మౌనిక హోటల్‌ మేనేజ్‌మెంట్, చిన్నమ్మాయి యామిని ఇంటర్‌ చదువుతున్నారు. ఈనెల 5న కవిత(52)ను కరోనా బలి తీసుకుంది. దీంతో ఇద్దరికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. పక్షవాతంతో మంచానికే పరిమితమైన నానమ్మ, తాతకు సేవలు చేస్తూ ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబం గడిచేదెలా? చదువులు సాగేదెలా? అన్నది వారిని తీవ్రంగా కలచివేస్తోంది.

సాయం కావాలంటే ఫోన్‌ చేయండి

కొవిడ్‌ సమయంలో అనాథలుగా మారిన పిల్లల సంరక్షణ కోసం శిశు సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. తల్లి లేదా తండ్రి చనిపోయిన వారిని ఆదుకుంటోంది. ప్రభుత్వ పథకాల సహాయం కింద కుటుంబ అవసరాలు తీర్చడం, పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పించడం, ఉన్నత చదువుల కోసం గురుకులాల్లో ప్రవేశాలు కల్పించడం లాంటి వాటిపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని అసహాయ చిన్నారుల సంరక్షణ, సహాయం కోసం 040-23733665 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు)కు ఫోన్‌ చేయవచ్చు. 1098 ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (24 గంటలు) కూడా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ డి.దివ్య ఏర్పాటు చేశారు. వచ్చే కాల్స్‌ను నిరంతరం పర్యవేక్షించేందుకు సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

ఇదీ చూడండి: 2డీజీ ఔషధం పంపిణీ ప్రారంభం కాలేదు.. మోసపోవద్దు: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.