వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు శాంతియుత నిరసన చేపట్టాయి. కార్పొరేట్ శక్తులు, కేంద్రం కలిసి అన్నదాతలను కుట్రదారులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించడం సరైనది కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి మద్దతుగా అదాని, అంబానీ ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపుతో హిమాయత్ నగర్లోని ఓ దుకాణం ముందు నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
రైతుల చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరుకుందని ఆయన తెలిపారు. నాలుగు వందల రైతు సంఘాలు కలిసి చేస్తోన్న ఆందోళనపై కొందరు మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం చేస్తోందని ఆయన ఆరోపించారు.
శాంతియుతంగా నిరసన చేస్తున్న బి.వి.రాఘవులు, నంద్యాల నరసింహారెడ్డి, డీజీ నరసింహారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు టి.సాగర్, స్కైలాబ్ బాబు, విజయ్, బి. ప్రసాద్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: వాడిన పూలు వికసించెనే.. పడతి ప్రగతికి సహకరించెనే...