ప్రొఫెసర్ కాశీం అరెస్టుకు సంబంధించి.. పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలతో నివేదికను హైకోర్టుకు సమర్పించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని తేలడం వల్ల దర్యాప్తు అధికారి వారెంట్ తీసుకుని సోదాలు నిర్వహించి సాహిత్యం, డిజిటల్ సాక్ష్యాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లుగా సోదాల సమయంలో.. పోలీసులు ఎలాంటి వస్తువులను అక్కడ ఉంచలేదన్నారు.
కాశీం భార్య, పిల్లలను ఇంట్లోనే ఉంచి అరెస్టుకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదనడం అవాస్తవమన్నారు. కాశీం, ఆయన భార్య స్నేహలత సమక్షంలోనే సోదాలు నిర్వహించామన్నారు. సోదాల్లో లేఖలు, సాహిత్యం, హార్డ్ డిస్క్, కార్డ్ రీడర్.. డిజిటల్ వీడియో క్యాసెట్లు, కెమెరాల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించామన్నారు.
భార్య సమక్షంలో..
ఈ మొత్తం ప్రక్రియను నిందితుడు, ఆయన భార్య సమక్షంలోనే వీడియో చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్తో సహా అన్ని వివరాలపై నోటీసులు జారీ చేసి.. అరెస్ట్ మెమోపై నిందితుని భార్య సంతకాన్ని కూడా తీసుకున్నామన్నారు. ఒకసారి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుని.. రిమాండ్ ఉత్తర్వులు జారీ అయ్యాక హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ ముగిసినట్లేనని పోలీసులు వివరించారు.
నాలుగు కేసుల్లో నిందితుడిగా..
కాశీం 4 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని.. కోర్టుకు పోలీసులు వెల్లడించారు. మరో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ.. ధర్మాసనం నిర్దోషిగా ప్రకటించిందన్నారు. మావోయిస్టులతో సంబంధాలను ఉద్యోగాల ముసుగులో కొనసాగిస్తుంటారని.. వీరి గురించి ఎవరూ సాక్ష్యాలు ఇవ్వడానికి ముందుకురారని తెలిపారు. కీలక సాక్ష్యాధారాలు సేకరించేదాకా.. దర్యాప్తు అధికారి ఓ నిర్ణయానికి రాలేరని, అందువల్ల కేసులు ఎప్పుడో నమోదైనా.. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు.
సీల్డ్ కవర్లో..
తమ పేర్లను వెల్లడించకుండా కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పిస్తామన్న షరతులతో.. సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారని, వాటిని సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. అండర్ గ్రౌండ్ మావోయిస్టులతో.. కార్తీక్ పేరుతో సంప్రదిస్తున్నారని వివరించారు.
మావోయిస్టుల కోసం పని..
2016లో నమోదైన కేసుల్లో 54 మంది నిందితులున్నారని.. ఎందరిని అరెస్ట్ చేశారని హైకోర్టు ప్రశ్నించిందని పోలీసులు తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడు శ్యాం సుందర్ రెడ్డి అని.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కాశీం... మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి 2018లో ఛార్జి తీసుకున్నారని.. లొంగిపోయిన వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుని కాశీంను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఇవీ చూడండి: హత్య కేసు నిందితుడి చెరలో 20మంది చిన్నారులు!