కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చ జరుగుతున్న నేపథ్యం, రైతులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా వివిధ పంటల సాగు వ్యయంపై ‘జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్’(సీఏసీపీ) వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రాల వారీగా ఒక్కో పంటసాగుకు రైతు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, క్వింటా పంట ఉత్పత్తికి ఎంత ఖర్చువుతోంది తదితర వివరాలు పంపాలని అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖలకు ఇటీవల కమిషన్ సూచించింది. ఈ మేరకు తెలంగాణలో ప్రస్తుత ఏడాది సాగు ఖర్చులను వ్యవసాయశాఖ సేకరించింది. పంటల వారీగా క్వింటా ఉత్పత్తి వ్యయాన్ని తెలుపుతూ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం దానిపై అదనంగా 50 శాతం కలిపి వచ్చే ఏడాదికి మద్దతు ధర ఇవ్వాలని సీఏసీపీకి సిఫార్సు చేసింది.
ప్రధాన పంటలు భారమే...
రాష్ట్రంలో వేసే పంటల్లో పత్తి, వరి, మొక్కజొన్న, సోయాచిక్కుడు 90 శాతానికిపైగా విస్తీర్ణంలో ఉంటున్నాయి. ఉదాహరణకు గత వానాకాలం(ఖరీఫ్)లో కోటీ 34 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో పత్తి 60.15 లక్షల ఎకరాలు, వరి 52 లక్షల ఎకరాల్లో సాగైంది. 60 లక్షల ఎకరాల్లో సగటున ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. క్వింటాకు మద్దతు ధర 5,825 ఇస్తుండగా, సాగు వ్యయం రూ.9,954 అవుతోంది. ఈ లెక్కన క్వింటాలుకు నికరనష్టం రూ.4129. ఈ లెక్కన ఐదు క్వింటాళ్లపై రూ.20,645 వరకూ ఎకరానికి పెట్టుబడి ఖర్చు తిరిగి రాలేదని అర్థం. అంటే 60.15 లక్షల ఎకరాలకు రైతులకు తిరిగిరాని పెట్టుబడి ఖర్చు రూ.12,417 కోట్లు ఉంటుంది.
- ఈ ఏడాది సాగువ్యయానికన్నా తక్కువగా మద్దతు ధరలు నిర్ణయించడంవల్ల కేవలం వరి, పత్తిపైనే రైతులు నికరంగా నష్టపోతున్న సొమ్ము రూ.28,665 కోట్లు.
- నిజానికి రైతులందరి పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. ఈ ఏడాది ఇప్పటికి మార్కెట్లకు వచ్చిన పత్తి పంటలో సగానికిపైగా మద్దతు ధర రాలేదని మార్కెటింగ్ శాఖ లెక్కలే చెబుతున్నాయి. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే నష్టం మరింత అధికంగానే ఉంటుందని అధికారులే అంగీకరిస్తున్నారు.

డీజిల్, కూలీలకే అధికం

డీజిల్, పెట్రోలు, కూలీల రేట్లు గణనీయంగా పెరగడంతో దాని ప్రభావం రవాణా, కౌలు, ఇతర వ్యవసాయ సామగ్రిపై పడి పెట్టుబడి అధికమైనట్లు క్షేత్రస్థాయి అధికారులు వ్యవసాయశాఖకు నివేదించారు. ‘ఒక్కో జిల్లాలో ఒక్కోతీరుగా పంట సాగు ఖర్చులున్నాయి. వరికోతలకు యంత్రాలను విరివిగా వాడుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో వాటి కిరాయిలు ప్రతి పంట కాలంలో పెరుగుతున్నాయి. వెయ్యి రూపాయలు వెచ్చిస్తే తప్ప టన్ను చెరకు నరికి మిల్లుకు తరలించలేని పరిస్థితి ఉంది. వరి నాట్లు వేయడానికే ఎకరానికి రూ.నాలుగైదు వేలవుతోందని’ ఆయా జిల్లాల అధికారులు పేర్కొన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. వరిసాగు వ్యయం బాగా పెరిగిందని, ఈ పంటపై రైతులకు ఏమీ మిగలడం లేదని పేర్కొన్న ఆయన, ప్రత్యామ్నాయంగా నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఆలుగడ్డ వంటివి వేస్తే అధికాదాయం వస్తుందని తెలిపారు.


