విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఎలక్ట్రిషియన్ దొంగతనాల బాట పట్టాడు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
టాస్క్ఫోర్స్ పోలీసుల కథనం ప్రకారం...
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆరు నెలల ఎలక్ట్రిషియన్ కోర్సులో శిక్షణ పొందాడు. అక్కడ సరిగ్గా పనులు లేకపోవడం వల్ల కుటుంబంతో కలిసి 1993లో నగరానికి వచ్చాడు. ఫలక్నుమా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ కరంట్ పనులు చేసేవాడు. స్నేహితులతో పరిచయాలు, ఇతర కారణాలతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బు సరిపోకపోవడం వల్ల తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. అలా 13కు పైగా దొంగతనాలు చేశాడు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల దర్యాప్తు చేపట్టిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. గత ఏడాది డిసెంబర్ 31న అపహరించిన బంగారాన్ని విక్రయించేందుకు పాట్ మార్కెట్కు వచ్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో విచారణ నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 579 గ్రాముల బంగారు నగలు, 1,510 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.45 వేల నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వెల్లడించారు.
ఇవీ చూడండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం