రెవెన్యూ శాఖలో ఖాళీల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పదవీ విరమణ చేసే వారి సంఖ్య పెరుగుతుండగా అదేస్థాయిలో భర్తీలు లేకపోవడం ఇందుకు మరో కారణం. డిప్యూటీ తహసీల్దారు నుంచి ఆపై క్యాడర్ వరకు పదోన్నతులు కల్పించే ప్రక్రియకు మూడేళ్లుగా ముందడుగు పడలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 95 డిప్యూటీ కలెక్టర్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులోపు పదవీ విరమణ చేస్తున్న 23 మందితో కలిపి ఆ సంఖ్య 118కు చేరుకోనుంది. రాష్ట్రంలో 25 స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల స్థానాలు, 77 తహసీల్దార్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దారు నుంచి పదోన్నతుల ద్వారా వీటిని పూరించాల్సి ఉంది.
కొన్నేళ్లుగా డిప్యూటీ తహసీల్దారు నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల వరకు నిర్వహించాల్సిన పదోన్నతుల కల్పన ప్రక్రియ జరగడం లేదు. డిప్యూటీ కలెక్టర్ల (ఆర్డినరీ) నుంచి స్పెషల్ గ్రేడ్కు 2018 ఫిబ్రవరిలో చివరిసారిగా 20 మందికి పదోన్నతులు కల్పించారు. గతేడాది నవంబరులో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్య అనంతరం రెవెన్యూ సంఘాల విజ్ఞప్తి మేరకు పదోన్నతులు, ఖాళీల భర్తీ చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. నేటికీ కార్యాచరణ రూపుదాల్చలేదంటూ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అదనపు విధులతో సతమతం
భూ దస్త్రాల నిర్వహణతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన విధులనూ రెవెన్యూ ఉద్యోగులు నిర్వర్తిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లకు లబ్ధిదారుల ఎంపిక, గొర్రెలు, ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణతో పాటు ఇతర శాఖలకు సంబంధించి దాదాపు 36 విధుల్లో పాలుపంచుకుంటున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేయగా.. నెలవారీగా పదవి విరమణలతో ఏర్పడుతున్న ఖాళీలు ఉద్యోగులపై పని భారాన్ని పెంచుతున్నాయి. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న వారిలో 9 మంది స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు 14 మంది ఉన్నారు. వీరిలో 8 మందిపై అనిశాతో పాటు శాఖాపరమైన కేసులు ఉన్నాయి.
ఇవీ చూడండి: అంతా రామమయం... యాత్రంతా రామాయణం