ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన సివిల్ సర్వెంట్ల కోసం కేంద్రంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా నియామకాలు చేపడుతుంది. సివిల్స్కు ఎంపికైన అధికారులను క్యాడర్ సంఖ్యకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ కేటాయిస్తుంది.
ముస్సోరీలో తర్ఫీదు.....
సివిల్ సర్వెంట్లుగా ఎంపికైన వారందరికీ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో శిక్షణ ఇస్తారు. కేటాయించిన రాష్ట్రాల్లోనూ వారికి క్షేత్రస్థాయి తర్ఫీదు ఇస్తారు. శిక్షణలో భాగంగా ఆయా జిల్లాల్లో అసిస్టెంట్ కలెక్టర్లుగా నియమిస్తుంటారు. పరిపాలనా విధానం, స్థితిగతులు ఇలా అన్ని అంశాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ముస్సోరీలోని అకాడమీలో శిక్షణతో పాటు క్షేత్రస్థాయి శిక్షణ అనంతరం కొత్త ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు పోస్టింగ్లు ఇస్తాయి.
17 మంది అధికారుల శిక్షణ పూర్తి...
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తెలంగాణ క్యాడర్కు కేంద్రం ప్రతి ఏటా ఐఏఎస్ అధికారులను కేటాయిస్తూ వస్తోంది. అదే క్రమంలో 2016లో ఎనిమిది మంది, 2017లో పది మంది అధికారులను రాష్ట్రానికి కేటాయించింది. ఈ అధికారులు ముస్సోరీ అకాడమీలో శిక్షణతో పాటు జిల్లాల్లోనూ క్షేత్రస్థాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2018 బ్యాచ్కు చెందిన ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు కూడాప్రస్తుతం శిక్షణలో ఉన్నారు.
ఒకరు మహారాష్ట్ర క్యాడర్కు...
2016, 2017 బ్యాచ్లకు చెందిన ఐఏఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసున్నప్పటికీ వారికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇంకా వారు జిల్లాల్లో ప్రత్యేకాధికారులుగా పనిచేస్తున్నారు. రెండు బ్యాచ్లకు చెందిన మెుత్తం 18 మంది అధికారులు ఉండగా... 2017 బ్యాచ్కు చెందిన ఒక ఐఏఎస్ మహారాష్ట్ర క్యాడర్కు వెళ్లిపోయారు. మిగిలిన 17 మంది అధికారులు పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్నారు.
2019 జనవరి ఒకటో తేదీ డీఓపీటీ జాబితా ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారుల సంఖ్య 154 మంది. అందులో 17 మంది అంటే దాదాపు పది శాతానికిపైగా అధికారులు పోస్టుల కోసం వేచిచూస్తున్నారు.
ఇవీచూడండి: రెండేళ్లయినా తీర్పు అమలు చేయకపోవటంపై హైకోర్టు ఆగ్రహం