రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో భారీగా పదోన్నతులు... బదిలీలలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జూనియర్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-1 అదనపు కమిషనర్ వరకు అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులతో పాటు బదిలీలు చేసేందుకు శాఖాపరంగా చర్యలు మొదలయ్యాయి. సాధారణ పరిపాలన శాఖతోపాటు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ల పర్యవేక్షణలో కసరత్తు కొనసాగుతోంది. వాణిజ్య పన్నుల శాఖ పునర్విభజనతో రెండు వాణిజ్య డివిజన్లు, 18 వాణిజ్య సర్కిళ్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. వివిధ క్యాటగిరిలకు చెందిన 161 పోస్టులు కొత్తగా మంజూరయ్యాయి. పునర్విభజనతో మంజూరైన కొత్త పోస్టులతో పాటు దీర్ఘకాలికంగా పదోన్నతులు పెండింగ్ ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంతో పాటు చాలా కాలంగా ఒకే చోట పని చేస్తున్న అధికారులను, సిబ్బందిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాణిజ్య పన్నుల శాఖ పునర్విభజనతో...12 వాణిజ్య డివిజన్లు 14కి, వంద సర్కిళ్లు 118కి పెరిగాయి. సర్కిళ్ల పరిధి అస్తవ్యస్తంగా ఉండడం, వ్యాపారుల లైసెన్స్లు కొన్నింటిలో అతి తక్కువగా, మరికొన్నింటిలో ఎక్కువగా ఉండడంతో పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తేవి. దీంతో కొందరు అధికారులకు సరిపడా పనిలేకుంటే.... ఎక్కువ సర్కిళ్లు కలిగిన డివిజన్లలో అధికారులు పని ఒత్తిడితో సతమతమయ్యేవారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు శాఖను పునర్విభజన చేసి అందరికి సమాన పని ఉండేలా చర్యలు తీసుకున్నారు. సోమేశ్కుమార్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రక్షాళనకు పునాది పడింది. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పునర్విభజన ప్రక్రియను పూర్తి చేశారు.
వాణిజ్య పన్నుల శాఖ పునర్విభజనకు అనుగుణంగా గతంలో మంజూరైన 37 జూనియర్ అసిస్టెంట్లు, 30టైపిస్టులు, 35 రికార్డు అసిస్టెంట్లు, 59 డ్రైవర్లు పోస్టులు కలిపి 161 పోస్టులను రద్దు చేసింది. వాటి స్థానంలో ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాయింట్ కమిషనర్ పోస్టులు-3, ఉప కమిషనర్లు-6, సహాయ కమిషనర్లు-10, సీటీవోలు-18, డీసీటీలోలు-59, ఏసీటీవోలు-65 లు లెక్కన 161 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇలా రెండు వేల మంది సిబ్బంది, అధికారులు ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో... దాదాపు 500మందికి పదోన్నతులు, బదిలీలు జరుగుతాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. నెలాఖరు లోపు పదోన్నతులు , బదిలీల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.