ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి మహమూద్ అలీ ప్రజలను కోరారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అన్ని ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల దృష్ట్యా ఇళ్ల నుంచి బయటికి వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప... బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, శానిటైజర్లు, మాస్కులు ఉపయోగించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బయటి ప్రాంతంలో మరుగుదొడ్లు వాడకూడదని, ఆరాధన స్థలాలకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ... ప్రజలు ప్రార్థనలు చేస్తున్న ఫొటోలు దినపత్రికలలో చూసి ఆనందం కలిగిందని హోంమంత్రి తెలిపారు.