telangana weather report: బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆదివారానికి అది మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసినట్లు ఆమె చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించిందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు.
![](https://assets.eenadu.net/article_img/070822brk122150792a.jpg)
కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆమె వివరించారు. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అక్కెనపల్లి(పెద్దపల్లి జిల్లా), పాత మంచిర్యాలలో 9.2, వంకులం(కుమురంభీం)లో 7.3, అర్నకొండ(కరీంనగర్)లో 6.1, కారేపల్లి(ఖమ్మం)లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ తగ్గడంతో చల్లని వాతావరణం ఏర్పడింది.
ఇవీ చూడండి..
తెలంగాణకు 1.11 లక్షల ఇంజినీరింగ్ సీట్లు.. మూడొంతులు ఆ కోర్సులవే