![](https://assets.eenadu.net/article_img/ghmain-2a_124.jpg)
మొన్నటివరకు బోసిపోయిన రహదారుల్లో ట్రాఫిక్ పెరుగుతోంది.. బస్సులు, రైళ్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయి.. దుకాణాల వద్ద సందడి పెరుగుతోంది. మద్యం కోసం ఎగబడుతున్న మందుబాబులు.. కూరగాయలు, చేపల మార్కెట్లలో గుంపులుగుంపులుగా జనం.. మూడో వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఆ భయం కనిపించడం లేదు. చిన్నచిన్న దుకాణాల వద్ద సైతం ఒకేసారి పదుల సంఖ్యలో కొనుగోలుదారులు కనిపిస్తున్నారు. కొవిడ్ నిబంధనల ఊసే లేదు. మాస్కుల వినియోగమూ తగ్గిపోతోంది. కాస్తంత శాంతించిన కొవిడ్ మహమ్మారి ఈ అజాగ్రత్తలతో మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని అధికారులు, వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టేందుకు, సామాన్యుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి పగటివేళ మినహాయింపు ఇచ్చింది. అవసరాల మేరకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కొవిడ్ నిబంధనలు పాటిస్తే ప్రజలకు క్షేమకరం. కానీ ఇందుకు భిన్నంగా జరుగుతోంది. జాగ్రత్తలు పాటించకుండానే చాలా మంది జనం బయట తిరుగుతున్నారు.
![](https://assets.eenadu.net/article_img/ghmain-2b_79.jpg)