హైదరాబాద్ గుడిమల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ను కరోనా తాకింది. ఇక్కడి మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి బయట విక్రయించే చిరు వ్యాపారికి వైరస్ సోకడం వల్ల అధికారుల్లో ఆందోళన నెలకొంది.
మార్కెట్లోని ఓ కమిషన్ ఏజెంట్ దగ్గర సదరు వ్యక్తి వారం రోజుల క్రితం పచ్చి మిర్చి కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ దుకాణం తో పాటు పక్కనున్న మరో ఐదు దుకాణాలను మార్కెట్ కమిటీ ఆదివారం మూసి వేయించింది.
గుడిమల్కాపూర్ మార్కెట్ను సందర్శించిన వ్యక్తికి కరోనా సోకడం వల్ల రేపటి నుంచి మూడ్రోజుల పాటు (మే 5-మే 7) మార్కెట్ను మూసి వేయనున్నట్లు కమిటీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ మూడు రోజుల్లో మార్కెట్ను రసాయనాలతో శుద్ధి చేస్తామని తెలిపారు.
మే 7 తర్వాత గుడిమల్కాపూర్ మార్కెట్లో అమ్మకాలు మొదలవుతాయని స్పష్టం చేశారు. అంతవరకు రైతులు, కొనుగోలుదారులు మార్కెట్కు రావద్దని విన్నవించారు.