ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్10 వాహక నౌక ప్రయోగానికి సన్నాహక ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అనంతరం బ్రహ్మప్రకాష్ హాల్లో మంగళవారం ఉదయం రాకెట్ సన్నద్ధత సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించారు. దశల వారీగా రాకెట్ అనుసంధానంపై సమీక్షించారు.
![GSLV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12736385_791_12736385_1628643948203.png)
సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశంలో ప్రయోగానికి అధికారికంగా అనుమతిచ్చారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమై నిరంతరాయంగా 26 గంటలపాటు కొనసాగనుంది. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 వాహకనౌక నింగిలోకి దూసుకెళుతుంది. దీని ద్వారా 2,268 కిలోల బరువున్న జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది.