తెలంగాణ తొలి గ్రూప్-1కు నిరుద్యోగ అభ్యర్థులు రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత వెలువడిన ఈ నోటిఫికేషన్కు ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్-1 ప్రకటన సమయంలో వచ్చినవాటి కన్నా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తం 503 పోస్టులతో కూడిన తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనకు సోమవారం రాత్రి 10 గంటల వరకు 2,94,644 దరఖాస్తులు వచ్చాయి. నేడు చివరి రోజు కావడంతో వీటి సంఖ్య 3 లక్షలు దాటే అవకాశముందని టీఎస్పీఎస్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 312 పోస్టులతో వెలువడిన గ్రూప్-1 ప్రకటనకు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. దరఖాస్తు గడువు దగ్గరపడటంతో అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుకు పోటెత్తారు. గ్రూప్-1 కోసం రోజుకు సగటున 10వేల దరఖాస్తులు వస్తే... సోమవారం ఒక్కరోజే 32 వేలు వచ్చాయి. సర్వర్పై ఒత్తిడి పెరగకుండా, అభ్యర్థులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా కమిషన్, సీజీజీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం చివరిరోజు కావడంతో భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు.
సమయం కావాలంటూ విజ్ఞప్తులు...
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు ప్రాథమికంగా టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు మరింత సమయం కావాలని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నుంచి కమిషన్కు అభ్యర్థనలు వస్తున్నాయి. గ్రూప్-1 ప్రకటన సుదీర్ఘకాలం తరువాత వెలువడిందని, సన్నద్ధమయ్యేందుకు అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు ఇప్పటికీ గ్రూప్-1 మెటీరియల్ మార్కెట్లో సిద్ధంగా లేదు. తెలుగు అకాడమీలోనూ కొరత ఉంది. అభ్యర్థులు గ్రూప్-1కు సన్నద్ధం అయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం కావాలని కోరుతున్నారు. జులైలో బ్యాంకు, ఎస్ఎస్సీ, రైల్వే, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి. ఆగస్టులో ఇప్పటికే పోలీసు నియామక మండలి ఎస్సై కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూలు ప్రకటించింది. ఈ పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులే గ్రూప్-1కు పోటీపడుతారు. మరోవైపు సెప్టెంబరులో సివిల్స్ ప్రధాన పరీక్ష షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. ప్రిలిమినరీ పరీక్ష గడువు విజ్ఞప్తులను టీఎస్పీఎస్సీ పరిశీలిస్తోంది.
* వైద్యఆరోగ్యశాఖ పరిధిలో ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ పోస్టుల భర్తీకి రెండోవిడత ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్ 4న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవీ చూడండి..