ఇరవయ్యేళ్ల క్రితం వరకూ... పిల్లలకైనా పెద్దలకైనా సాయంకాలం చిరుతిండి అంటే వేయించిన వేరుసెనక్కాయలూ బెల్లంముక్కే. కొందరయితే ఉదయంపూటా గుప్పెడు పల్లీలు వేయించినవో, ఉడికించినవో తినే పొలం పనుల్లోకి వెళ్లేవారు. అప్పట్లో సినిమాకి వెళ్లినా షికారుకి వెళ్లినా పల్లీల పొట్లమే కాలక్షేపం తిండి. నేరుగానే కాదు, పల్లీల్ని భిన్న రూపాల్లో తినడమూ మనకలవాటే. బెల్లం పాకం పట్టి చేసిన పల్లీ పట్టీకి మరే స్వీటూ సాటి రాదంటే అతిశయోక్తి కాదు. ఇడ్లీ, దోశ చేస్తే వేరుశనగ చట్నీ లేకుంటే ముక్క తుంచని వాళ్లు కొందరయితే, వేడి అన్నంలో కాస్త నెయ్యి, పల్లీకారప్పొడి వేసుకుని తింటే స్వర్గం కళ్లముందే కనిపిస్తుందనేవాళ్లు మరికొందరు.
పల్లీతో పెరుగు...
వేరుశనగ పప్పుల్లేని పులిహోర, మిక్చ్సర్లను అస్సలు ఊహించలేం. అందుకే మరి... వేరుసెనగల రుచికి వాటికవే సాటి అంటుంటారు పల్లీ ప్రియులు. ఇక, వేరుసెనగనూనెను వంటల్లో వాడటం, నిల్వ పచ్చళ్లకు వాడటం తెలిసిందే. నిజానికి మనదగ్గర పల్లీల రూపంలోకన్నా నూనె రూపంలోనే వాడుక ఎక్కువ. కొన్నిచోట్ల కొబ్బరిపాల మాదిరిగానే వీటితో పాలూ చేస్తారు. వాటితో పెరుగూ తోడు పెడతారు. పాశ్చాత్య దేశాల్లో వాటి నుంచి తీసిన పీనట్ బటర్ ఉంటే చాలు, బ్రెడ్ మీదకి మరే ఫ్రూట్ జామ్ అవసరం ఉండదు. పంచదార పాకంలో ముంచి తీసిన పల్లీలు అక్కడ మంచి స్నాక్ఫుడ్. చాకొలెట్లు, స్వీట్లు, కుకీలు, కేకుల్లోనూ పల్లీలు వాడతారక్కడ. మొత్తమ్మీద ఎవరు ఏ రూపంలో తిన్నా, విశ్వమంతటా వీటి వాడకం ఉండేదన్నది మాత్రం యథార్థం.
పోషకాల పల్లీలు!
మనకు తెలిసిన వేరుసెనగ గుళ్లన్నీ ఎక్కువగా లేత ఎరుపూ లేదా కనకాంబరం రంగులో మాత్రమే ఉంటాయి. కానీ వీటిల్లో చారలుండేవీ, ఎరుపు, తెలుపు, నలుపు రంగుల్లో పండేవీ కూడా ఉంటాయి. పోషకాలపరంగా వేరుసెనగల్ని నట్స్ జాబితాలోకి చేర్చినప్పటికీ నిజానికివి నట్స్ కాదు, సోయా, బఠాణీ, చిక్కుళ్ల మాదిరిగానే లెగ్యూమ్ జాతికి చెందుతాయి. అందుకే వీటిని పీస్(బఠాణీ) నట్స్ కలిపి పీనట్స్గా పిలుస్తున్నారు. నేలలోపల కాస్తాయని గ్రౌండ్నట్స్ అనీ అంటున్నారు.
అయితే ఈమధ్య బాదం, అక్రోట్లు, పిస్తా... వంటి ఖరీదైన విదేశీ నట్స్ మార్కెట్లోకి రావడం, వాటి వాడకం పెరగడంతో దేశీయంగా పండే పీనట్స్ రుచిని కాదని వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటోంది ఆధునిక తరం. కానీ పల్లీల్లోని పోషక, ఔషధ గుణాలు వాటికేమాత్రం తీసిపోవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అందుకే యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు పీనట్ బటర్నీ పాలనీ ఇచ్చే ప్రాజెక్టును రూపొందించాయి.
ఆరోగ్య సమస్యలకు చెక్
అవునుమరి, రోజూ గుప్పెడు పల్లీలు తినేవాళ్లని హృద్రోగ సమస్యలు పలకరించడానికే భయపడతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంటోంది. వీటిల్లో మంచి కొలెస్ట్రాల్ను పెంచే మోనో అన్శాచ్యురేటెడ్, పాలీ అన్శాచ్యురేటెడ్ ఆమ్లాల శాతమే ఎక్కువ. మిగిలిన నట్స్తో పోల్చితే పల్లీల్లోనే ప్రొటీన్ శాతం ఎక్కువ. వంద గ్రా. నట్స్లో అత్యధికంగా 25 గ్రా. ప్రొటీన్ లభిస్తుంది. మాంసం, గుడ్లలోకన్నా కూడా వీటిల్లోనే ప్రొటీన్ ఎక్కువ. ఎ, బి, సి, ఇతో కలిపి 13 రకాల విటమిన్లూ; ఐరన్, కాల్షియం, కాపర్, జింక్, బోరాన్.. వంటి 26 రకాల ఖనిజాలూ; పీచూ; ఆరోగ్యకరమైన కొవ్వులూ వేరుసెనగల్లో సమృద్ధిగా దొరుకుతాయి. ముఖ్యంగా శరీర భాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలంటే అందుకు శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదూ కీలకం. ఇవన్నీ వేరు సెనగపప్పుల్లో పుష్కలంగా ఉంటాయి. గింజల తొక్కల్లో రెస్వెరాట్రల్ అనే ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంటూ ఉంటుంది.
- వేరుసెనగగింజల్లోని విటమిన్-ఇ మంచి యాంటీఆక్సిడెంట్. ఇది కణాల్లో ఆక్సీకరణ ప్రక్రియను తగ్గించడం ద్వారా అవి దెబ్బతినకుండా చూస్తుంది. అలాగే వీటిల్లోని మెగ్నీషియం
- కండరాలూ, ఎంజైముల పనితీరుకీ శక్తి ఉత్పత్తికీ తోడ్పడుతుంది.
- కణవిభజనకు అవసరమయ్యే ఫొలేట్ పల్లీల్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి గర్భిణీలు, పిల్లలకీ ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరిగి హెపటైటిస్, క్షయ వంటివి రాకుండా ఉంటాయట.
- ఎర్రరక్తకణాలు, ఎముకలు, నరాల పనితీరుకి పల్లీల్లోని కాపర్ తోడ్పడుతుంది. దంత ఆరోగ్యాన్ని పెంచే ఫాస్ఫరస్ కూడా ఇందులో ఎక్కువే. ఇక, వేరుసెనగగింజల్లోని పీచు త్వరగా పొట్ట నిండేలా చేయడంతోపాటు జీర్ణశక్తిని పెంచుతుంది.
- పల్లీల్లోని పీచూ కొవ్వుల కారణంగా వీటిని తగు మోతాదులో రోజూ తినేవాళ్లు బరువు పెరగరని ఓ పరిశీలనలో తేలింది.
- పల్లీల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ వాళ్లకీ ఇవి మంచి ఆహారమే.
- హీమోఫిలియా రోగులకూ పల్లీలు మంచివట. ముక్కు నుంచి రక్తం కారుతుంటే కాసిని పల్లీలు తింటే వెంటనే తగ్గుతుందట. నెలసరిలో అధిక రక్తస్రావమయ్యే మహిళలు కాసిని నానబెట్టిన పల్లీలకి బెల్లం చేర్చి తింటే ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది.
ఎలా తినాలి?
పల్లీల్ని వేయించినప్పుడు వాటిల్లోని పి-కౌమరిక్ ఆమ్లం 22 శాతం పెరుగుతుందట. అందుకే వేయించిన పల్లీల్లో యాంటీఆక్సిడెంట్లు బెర్రీల్లోకన్నా ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే వేయించినవి కొందరిలో అలర్జీకీ కారణం కావచ్చు. తాజాగా ఉండే పచ్చి పల్లీల్ని తింటే చిగుళ్లు గట్టిపడి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ పచ్చి పల్లీల్లో ఫంగస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని నానబెట్టి మొలకెత్తించి తింటే మంచిదంటారు. ఇలా చేయడం వల్ల వాటిల్లో బి, సి విటమిన్ల శాతం కూడా పెరుగుతుందట. పచ్చివీ, నానబెట్టినవీ, మొలకలు వచ్చినవీ, ఉడికించినవీ వేయించినవీ ఏ రూపంలో తీసుకున్నా పోషకాల్లో పెద్దగా వ్యత్యాసం ఉండదు కానీ ఉడికించి తింటే త్వరగా జీర్ణమవుతాయన్న కారణంతో అవే తినమని చెబుతారు పోషక నిపుణులు.
నష్టాలున్నాయ్...
పచ్చివీ వేయించినవాటికన్నా తొక్కలతో ఉడికించిన పల్లీల్లో యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరగడంతోపాటు కొవ్వుల శాతం సగానికి సగం తగ్గిపోతుందనీ తద్వారా క్యాలరీలూ తగ్గుతాయనీ కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మంచివి కదాని మరీ ఎక్కువగా తింటే శరీరంలో ఆమ్లగుణం పెరుగుతుంది. ఆస్తమా ఉన్నవాళ్లు కాస్త తక్కువగానే తినాలి. అదీ ఉప్పునీళ్లలో ఉడికించి తింటే మంచిదట. వేరుసెనగగుళ్లలోని అరాచిన్, కొనార్చిన్ ప్రొటీన్లు కొందరిలో అలర్జీలకు కారణమవుతాయి. మరో ముఖ్యమైన విషయమేంటంటే- ఇవి నేలలో పెరుగుతాయి కాబట్టి ఆస్పర్జిలస్ అనే ఫంగస్ చేరే అవకాశం ఉంది. ఇది క్యాన్సర్కి దారితీసే ఎఫ్లోటాక్సిన్లను విడుదల చేస్తుంది. కాబట్టి వీటిని కొనేటప్పుడూ నిల్వచేసేటప్పుడూ జాగ్రత్త అవసరం. సో, అదండీ సంగతి. పల్లీలు... ఏదో టైంపాస్ తిండి అనుకోకుండా వాటిల్లో ఉన్న ఔషధాల్ని గుర్తించి మరీ తినండి!
ఇదీ చదవండి: కశ్మీరి చిల్లీ మటన్.. చూస్తేనే నోరూరెన్..!