ఇంధన ధరలు పెరుగుతున్న వేళ విద్యుత్ వాహనాలకు (Electric Vehicles) ప్రాధాన్యత పెరుగుతోంది. విద్యుత్ వాహనాల వినియోగం పెంచేలా గో ఎలక్ట్రిక్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ అధ్వర్యంలో గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ పేరుతో విద్యుత్ వాహనాల ప్రదర్శన, రోడ్ షోను ఏర్పాటు చేసింది. కార్యక్రమాన్ని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, విద్యుత్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా ప్రారంభించారు. ఈ మొబిలిటీ, విద్యుత్ వాహనాల వినియోగం కల్పించేలా ఆయా సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. వారి సంస్థల విద్యుత్ వాహనాల ప్రయోజనాలను సందర్శకులకు వివరిస్తున్నారు.
పర్యావరణహిత కోసం ప్రజలు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయాలని.. అందుకు ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని విద్యుత్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ఈ మొబిలిటీ, విద్యుత్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని.. రాష్ట్రంలో ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెంచుతున్నామన్నారు. రాబోయే మూడేళ్లలో 600 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ రెడ్కో ఛైర్మన్ సయ్యద్ అబ్దుల్ అలీం, వివిధ విద్యుత్ వాహనాల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదీ చూడండి: నాగార్జునసాగర్కు మొదలైన పర్యాటకుల తాకిడి..!