కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో మార్కెట్ యార్డులలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు.. అమలుకు ఏ మాత్రం నోచుకోవడం లేందంటున్నారు వర్తకులు. రైతుబజార్లలో వినియోగదారులు, వ్యాపారుల రద్దీ తగ్గించడం, మనిషుల మధ్య భౌతిక దూరం పెంచేందుకు సంచార రైతుబజార్లు ఏర్పాటు చేసిన మార్కెటింగ్ శాఖ... ప్రధాన రద్దీగల మార్కెట్లను విస్మరించిందంటున్నారు.
వచ్చేవారిలో ఎవరికైనా వైరస్ ఉంటే...
రాష్ట్రంలోనే అతిపెద్దదైనా గడ్డిఅన్నారం మార్కెట్కు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదంటూ వర్తకులు వాపోతున్నారు. మామిడి రాక కూడా ఇప్పుడే మొదలవుతోందని.. బత్తాయి, ద్రాక్ష, యాపిల్ లాంటి పండ్లు భారీగా అమ్మకానికి వస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా లారీలు, ట్రక్కులు వస్తున్నాయని... ఆ వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు రైతులతో మార్కెట్ మొత్తం కిక్కిరిసిపోతుందని వెల్లడించారు. వీరిలో ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా... ఆ తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని భయాందోళనలకు గురవుతున్నారు.
మార్కెట్కు కూడా లాక్డౌన్ కావాలి...
దీనిపై హోల్సేల్ ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 14 వరకు గడ్డిఅన్నారం మార్కెట్కు కూడా లాక్ డౌన్ విధించాలని కోరారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్కెట్లో శానిటైజర్లు, స్క్రీనింగ్ టెస్ట్ వంటి సదుపాయాలేమీ లేవని వాపోయారు. రైతులు, చిరువ్యాపారులు, వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు ఎవరూ పెద్దగా మాస్క్లు వేసుకోవడంలేదని భయపడుతున్నారు.
లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల సరఫరా చట్టం కింద పండ్ల క్రయ విక్రయాలు చేపట్టవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని... అయితే ఇతర రాష్ట్రాల నుంచి సరుకుతోపాటు రైతులు, డ్రైవర్లు, క్లీనర్లు వస్తున్న దృష్ట్యా.. తెలంగాణేతర రైతులకు పాసులు జారీ చేసి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వర్తకులు, హమాలీలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: కరోనా మరణాల్లో చైనాను దాటేసిన అమెరికా