బెజవాడ దుర్గగుడి వెండి రథం మూడు సింహాల ప్రతిమల అదృశ్యం కేసులో ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక కీలకం కానుంది. ఫోరెన్సిక్ లేబరేటరీస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె.శరీన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం రథం వద్ద సేకరించిన ఆధారాలు సమగ్రంగా పరిశీలించి ఇచ్చే నివేదిక.. చోరీ ఎప్పుడు జరిగిందన్న విషయంపై నిర్ధరణకు రావడానికి దోహదపడతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
గత నెల 14న దేవస్థానం అధికారులు రథానికి ఉన్న వెండి సింహం ప్రతిమలు చోరీకి గురైన విషయాన్ని గుర్తించారు. ఘటనా స్థలంలో లభ్యమైన వెండి సింహాల రేకులపైన పేరుకుపోయిన రజను, ఇతర ఆధారాల ద్వారా ఎన్ని రోజుల క్రితం వాటిని పెకిలించారన్న విషయాన్ని నిర్ధరిస్తారని అధికారులు చెబుతున్నారు. వీటిని లాక్డౌన్ సమయంలోనే పెకిలించారా లేక దేవాలయం తెరిచిన తర్వాత అనే విషయంపై అధికారులు నిర్ధరణకు వచ్చే అవకాశం ఉంది.
మార్చిలో రథానికి నాలుగు వెండి సింహాలు ఉన్నాయన్న విషయంలో పాలిషింగ్ చేసే కాంట్రాక్టరు, గోల్డు అప్రైజర్ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా స్పష్టమవుతోంది. ఏప్రిల్, మే, జూన్ మూడు మాసాల్లో చోరీ జరిగితే మాత్రం.. ఆ సమయంలో విధులు నిర్వర్తించిన సిబ్బంది, మల్లేశ్వరాలయ విస్తరణ పనుల్లో పాల్గొన్న కార్మికులపైన సీసీఎస్ పోలీసులు దృష్టి కేంద్రీకరిస్తారని సమాచారం.
ఇదీ చదవండి: 2 ఏళ్ల సర్వీసు ఉంటేనే పరిహారం ఇస్తామంటున్న ఈఎస్ఐసీ