హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రహదారుల అభివృద్ధి మొదలు పట్టణారోగ్యం, పచ్చదనం పెంపు, మెట్రోరైలు రెండోదశ, ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(ఇ-బీఆర్టీఎస్) వరకు ఇందులో ఉన్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం విడుదల చేసిన 2020 వార్షిక ప్రగతి నివేదికలో హైదరాబాద్ గత ఐదేళ్ల పురోగతి, 2020-21 కార్యాచరణ ప్రణాళికలను వెల్లడించారు.
19కి.మీ ఎలివేటెడ్ బీఆర్టీఎస్
కేపీహెచ్బీ మెట్రోరైలు స్టేషన్ నుంచి ఫోరం మాల్ మీదుగా ఐటీ కారిడార్ను చుడుతూ.. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్, ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ బీఆర్టీఎస్ ప్రాజెక్ట్ను 2020-21 కార్యాచరణ ప్రణాళికలో ప్రభుత్వం చేర్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైంది.
ఎల్ఆర్టీఎస్ కూడా..
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి కోకాపేట వరకు లైట్ రైట్ ట్రాన్సిట్ సిస్టమ్(ఎల్ఆర్టీఎస్)ను 2020-21 ప్రణాళికలో చేర్చారు.
- మూడు కారిడార్లలో ట్రామ్వే/రోప్వే ప్రతిపాదనలు ఉన్నాయి.
నిర్మాణాల్లో దూకుడు..
- హైదరాబాద్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటి. గత ఐదేళ్లలో ఐటీ, వేర్వేరు సంస్థలు హైదరాబాద్లో తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
- 2015 నుంచి హైదరాబాద్లో 12.95 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణాలు కొత్తగా వచ్చాయి.
- 2015 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణాల అనుమతుల రూపంలో రూ.3507.5 కోట్ల ఆదాయం వచ్చింది. హెచ్ఎండీఏ పరిధిలో నిర్మాణ అనుమతుల రెవెన్యూ రూ.2000 కోట్లుగా ఉంది. మొత్తంగా ఐదేళ్లలో రూ.5507.5 కోట్ల ఆదాయం వచ్చింది.
- 2015 నుంచి గృహ నిర్మాణాల పరంగా చూస్తే 39.21 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు వెలిశాయి.
పాదచారుల వంతెనలు..
- హెచ్ఎండీఏ నగరంలో పాదచారుల వంతెనలు(ఎఫ్వోబీ) నిర్మిస్తోంది. వనస్థలిపురం, నెక్లెస్రోడ్, ఏఎస్రావునగర్, ఐడీపీఎల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఉప్పల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
- పాదచారుల నడకకు ఆటంకం లేకుండా 8చోట్ల స్కైవాక్స్ను హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ఇందులో ఉప్పల్, మెహిదీపట్నంలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్లుగా అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం డిజైన్ల దశలో ఉన్నాయి.
మెట్రో తొలిదశ వ్యయం రూ.21,919 కోట్లు
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్ట్పై ప్రభుత్వం, నిర్మాణ సంస్థ కలిసి రూ.21,919 కోట్లు వ్యయం చేశాయి.
- 2010-14 వరకు రూ.8683 కోట్లు ఖర్చు చేయగా.. 2015-20 వరకు రూ.13,236 కోట్లు వ్యయం అయ్యింది.
- రెండోదశ విస్తరణ (2020-21 ప్రణాళిక) మెట్రోరైలు విస్తరణ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) సిద్ధమై ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రెండు కొత్త కారిడార్లలో విస్తరణను ప్రదిపాదించారు.
- బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు వయా కొండాపూర్ 26 కి.మీ. (కారిడార్-1 మియాపూర్ స్టేషన్ను కలుపుతూ)
- విమానాశ్రయ ఎక్స్ప్రెస్ మెట్రో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ.
- కారిడార్-3లో మిగిలిన దూరం నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కి.మీ.