పళ్లు తోముకునే బ్రష్లు కూడా కరోనా కారకాలుగా మారుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లక్షణాలు లేకుండా కొవిడ్ కొందరిలో ఉంటుండటంతో ఒకే ఇంట్లో ఉండేవాళ్లు తమ బ్రష్లన్నింటినీ ఒకేచోట పెట్టడం మానాలని, విడివిడిగా పేస్టు వాడాలని దంతవైద్యులు సూచిస్తున్నారు. టూత్బ్రష్లు, వాటి కోసం వాడే కంటైనర్ల ద్వారా కూడా కొవిడ్ వైరస్ కుటుంబంలోని ఇతర సభ్యులకు చేరుతున్నట్లు యునైటెడ్ కింగ్డమ్ నుంచి వెలువడిన బీఎంసీ మెడికల్ జర్నల్లో ప్రచురితమైందని వివరిస్తున్నారు. కొవిడ్ సోకిన వ్యక్తి టూత్పేస్టును మిగతా కుటుంబ సభ్యులు వాడడం ద్వారా 33 శాతం ఇతరులకు వైరస్ సోకే ముప్పు ఉందని అధ్యయనంలో గుర్తించారని వైద్యులు వెల్లడిస్తున్నారు.
అదే బ్రష్ వాడొద్దు
కరోనా రోగుల హోం ఐసొలేషన్ పూర్తయ్యాక అవే బ్రష్లు వాడటం సరికాదు. వీటి ఉపరితలంపై 72 గంటల పాటు వైరస్ ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ మౌత్వాష్లతో బ్రష్లను శుభ్రం చేయడం ద్వారా 39 శాతం ముప్పు తప్పుతుంది. కొవిడ్ సోకిన వ్యక్తులు రోజులో 3 సార్లు 0.2 క్లోర్హెక్సిడైన్ ఉన్న ఏదైనా మౌత్వాష్తో పుక్కిలించడం ద్వారా వైరస్ ప్రభావాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఈ ద్రావణంలో 30 సెకన్ల పాటు బ్రష్ను ఉంచితే అందులోని వైరస్ 99 శాతం నాశనమవుతుందని పంజాబ్కు చెందిన డాక్టర్ హెచ్ఎస్జే ఇన్స్టిట్యూట్, సీఎస్ఐఆర్ అధ్యయనంలో తేలింది. కరోనా కట్టడికి నోటి శుభ్రత చాలా కీలకం.
- డాక్టర్ సి.శరత్బాబు, దంత వైద్య నిపుణులు, మెడికవర్
ఇదీ చదవండి: భూ దందాలపై గవర్నర్కు లేఖ రాస్తా: ఉత్తమ్