రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్- సెస్ను ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. సెస్ సంచాలకులు, బోధనా సిబ్బంది, అధికారులతో వినోద్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నీటిపారుదల, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషరీస్, బీమా వంటి రంగాలతోపాటు సంక్షేమ పథకాలకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధ్యయన కార్యక్రమాలను సంచాలకులు రేవతి వివరించారు.
కాళేశ్వరం సహా ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రైతులు లక్ష్యాన్ని మించి వరి పండిస్తున్నారన్న వినోద్ కుమార్... ఇతర దేశాల్లో మార్కెటింగ్ చేసే అవకాశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సెస్ బృందాన్ని కోరారు. పంటలబీమా పథకం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని, ఈ విషయంలో ఉత్తమ విధానం కోసం అధ్యయనం చేయాలన్నారు. రైతుబంధు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పంటల మార్పిడి విధానం అమలు, సేంద్రియ పంటల సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటాం..