రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే అంశంపై రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ను ప్రకటిస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఆయన పార్టీ వ్యవహారాల్లో క్రీయశీలక పాత్ర పోషిస్తున్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. లోక్సభతో పాటు స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో కేటీఆర్కు సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జోరందుకుంది. ఇందుకు తెరాస నేతలతో పాటు ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుకూలంగా వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వానికి మాట్లాడారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటన్న తలసాని.... ఆయనకు సమర్థత ఉందని కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి?
కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటూ తెరాస ఎమ్మెల్యేలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రచారాన్ని సమర్థిస్తూ.. వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని నిజామాబాద్ గ్రామీణ, బోధన్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్లు పేర్కొన్నారు. పార్టీ అధినేత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బాజిరెడ్డి కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ అధ్యక్షతన జరగాలన్నదే తన ఆకాంక్షగా షకీల్ పేర్కొన్నారు.
సీఎం బాధ్యతల అప్పగింతపై ఇప్పటికే అనేకసార్లు కేటీఆర్ ఖండించారు. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రచారం ఊపందుకోవడంతో కేటీఆర్ ఏం చెబుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇవీ చూడండి: నవకల్పన సూచీలో తెలంగాణకు 4వ స్థానం