రెండో దశలో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా.. చిన్నారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతోంది. తల్లిదండ్రులు వైరస్ బారిన పడితే... వారి పిల్లలు ఒంటరి వారవుతున్నారు. చిన్నారుల వసతి, భోజనం ఇబ్బందిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ దేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ట్రాన్సిస్ట్ హోంల పేరిట ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్లో తొలి కేంద్రం..
తొలుత హైదరాబాద్ వెంగళరావులోని శిశువిహార్ ప్రాంగణంలో ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో జీహెచ్ఎంసీ పరిధిలో మరో ఆరింటిని ఏర్పాటు చేసింది. జిల్లాల్లోనూ ఈ తరహా మొత్తం 50 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లా శిశు పరిరక్షణ కమిటీల ద్వారా ఆయా చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించేలా ఏర్పాటు చేశారు.
నిరంతర పర్యవేక్షణ..
తల్లిదండ్రులు కొవిడ్ బారిన పడిన చిన్నారులకు... ఆయా కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వర్చువల్ సదుపాయాన్ని కల్పించారు. నిరంతరం వారిని వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో ఉంచుతారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే....వారికి చికిత్స అందించేందుకూ ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక హెల్ప్లైన్..
మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ఉండగా... 040-23733665 నంబర్తో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. చిన్నారులకు సంబంధించి కొవిడ్ సంబంధ వివిధ సమస్యలను హెల్ప్ డెస్క్ దృష్టికి తీసుకురావచ్చు. కాల్ వచ్చిన గంట లోపే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల చిన్నారులకు అవసరమైన ఆహారపదార్థాలను సమకూరుస్తున్నారు.
కొవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో శిశువిహార్, బాలసదన్లలో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు మహిళా, శిశు సంక్షేమశాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
ఇవీచూడండి: ఏపీ అంబులెన్సులకు నో ఎంట్రీ... రాష్ట్ర సరిహద్దులో ఆందోళనకర పరిస్థితి