హైదరాబాద్ నగరాన్ని క్యుములోనింబస్ మేఘాలు ఆవరించాయి. గత రెండు రోజుల నుంచి నగరంలో కురుస్తున్న వర్షాలకు ఈ మేఘాలే కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. చిలకలగూడ, బోయిన్పల్లి, మారేడుపల్లి, అడ్డగుట్ట, ఫ్యాట్నీ, ప్యారడైస్, తిరుమలగిరి, నాంపల్లి, ట్యాంక్బండ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావటం వల్ల పూర్తిగా మేఘావృతమై చల్లబడింది. మొన్నటి వరకు వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడిపోయిన నగరవాసులు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉపశమనం పొందుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీనివల్ల వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.