ఈనెల 6 నుంచి ప్రారంభమైన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా చేపడుతున్న పనుల ద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎస్ ఎస్కే జోషి స్పష్టం చేశారు. బుధవారం రోజున బీఆర్కే భవన్ నుంచి కలెక్టర్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలో చేపడుతున్న పనులు నిరంతరం అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గ్రామాల్లో వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలకు స్థలాలను గుర్తించి, నిర్మాణాలు చేపట్టాలన్నారు.
గ్రీన్ యాక్షన్ ప్లాన్
మన ఊరు మనమే బాగు చేసుకుందాం అనేలా ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలని జోషి సూచించారు. ప్రతి గ్రామంలో గ్రీన్ యాక్షన్ ప్లాన్ను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్రావు, సెర్ఫ్ సీఈవో పౌసమి బసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.