Covid cases increasing in Telangana day by day: రాష్ట్రంలో కరోనా మరోమారు పంజా విసురుతోంది. దాదాపు 2శాతం పాజిటివిటీ రేటుతో నిత్యం 50 వరకు కేసులు నమోదవుతున్నాయి. కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. 2020లో ప్రారంభమైన కొవిడ్ రూపాంతరం చెందుతూ మూడు వేవ్లుగా వణికించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ జనవరిలో సున్నా కేసులు నమోదవ్వటంతో వైరస్ వ్యాప్తి ముగిసినట్లే భావించారు. ఇటీవల రోజుకి పది చొప్పున మొదలై యాభై మంది మహమ్మారి బారిన పడుతున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి విదేశాలకు వెళ్లేవారు, వైద్య అవసరాల మినహా టెస్టులు చేయించుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో వెలుగు చూస్తున్న కేసుల కంటే టెస్టులు చేయించుకోని వారి సంఖ్య అధికంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. దీనిపై కూడా అధికారులు దృష్టిసారించారు. ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు.
60 శాతం కొవిడ్ కేసుల హైదరాబాద్లోనే: ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 51 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. మరో 23మంది ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. భాగ్యనగరంలో వారం నుంచి నిత్యం 20కి పైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కేసుల్లో సుమారు 60 శాతం హైదరాబాద్లోనే నమోదవుతున్నాయి. దాదాపు పాజిటివిటీ రేటు పాయింట్ 5 శాతం నుంచి 1.6 శాతానికి పెరిగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మరోవైపు సున్నా కేసులున్న జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరగడం అధికారులు, ప్రజల్లో ఆందోళనలు పెంచుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని కోరుతున్నారు. జన సమూహ ప్రాంతాల్లో మాస్కులు , శానిటైజర్లు ఉపయోగిచాలని సూచిస్తున్నారు. అర్హులైన వారు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.
ఇవీ చదవండి: