రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకు తగిన గుణపాఠం చెప్పేందుకు రైతులు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి పిలుపునిచ్చారు. రైతుబంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దొంగ జపం చేస్తోందని కోదండరెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్నదాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతు బలోపేతం అయ్యేందుకు అమలు చేయాల్సిన పలు పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళం పాడాయని, ఇందువల్లనే రైతుకు ఆర్థిక సహాయం అందడం లేదని విమర్శించారు.
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వాలు మొండిచెయ్యి చూపిస్తున్నాయని ఆరోపించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలకు పావలా వడ్డీపై రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందని ధ్వజమెత్తారు.
పంటల బీమా పథకంపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని దాదాపుగా ఆ పథకం రద్దు అయినట్లయిందన్నారు. సబ్సిడిపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం కనుమరుగైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన రుణమాఫీ గురించి ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదని, ఖరీఫ్, రబీ పంటకాలానికి ఎస్ఎల్బీసీ నిర్దేశించిన 53వేల కోట్లు పంట రుణాల పంపిణీ 25శాతం కూడా రైతులకు అందని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అధిక వడ్డీ భారంతో, ప్రైవేటు అప్పులు భారీన పడిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.
ఇవీ చూడండి: గ్రేటర్లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్