Congress 100 MLA Candidates Selection Process in Telangana 2023 : అసెంబ్లీ బరిలో నిలిచే 100మంది అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కాంగ్రెస్(Congress) సుదీర్ఘ కసరత్తు చేసింది. మొదటి జాబితాలో ప్రకటించిన 55 మందిలో ఎక్కువ శాతం సిట్టింగ్లు, వివాదార రహిత స్థానాలు కావడంతో పేర్ల ఎంపికలో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ రెండో జాబితాలో 45 మంది విషయంలో సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను కూడా ప్రామాణికంగా తీసుకుని ఎంపిక ప్రక్రియను పూర్తిచేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కామారెడ్డి నుంచి కేసీఆర్(KCR) బరిలో నిలవడం వల్ల.. అక్కడ పోటీచేయాలని భావించిన షబ్బీర్ అలీ వెనుకంజ వేసినట్లు తెలిసింది. అయితే ఎల్లారెడ్డి టికెట్ ఆశించిన మదన్ మోహన్రావును.. కామారెడ్డి వెళ్లాలని ఏఐసీసీ సూచించింది. ఆయన కూడా నిరాకరించడంతో ఎల్లారెడ్డి నుంచే మదన్ మోహన్రావుకు టికెట్ ఇచ్చారు.
Telangana Congress MLA Candidates Selection Process : హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను బరిలో దించారు. ఈసారి మాత్రం వెలమ సామాజిక వర్గానికి చెందిన బల్మూరి వెంకట్ను పక్కన పెట్టి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వొడితల ప్రణవ్కు టికెట్ ఇచ్చారు. నర్సాపూర్ టికెట్ హామీతో గాలి అనిల్ కుమార్.. రెండు నెలలుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఐతే చివరికి సీటు ఆవుల రాజిరెడ్డికి దక్కింది. పార్లమెంటు టికెట్ ఇస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావుఠాక్రే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Congress Ticket Issues in Telangana : మహేశ్వరంలో పారిజాత నర్సింహారెడ్డికి టికెట్ ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే తాండూరు టికెట్ ఆశించిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి మహేశ్వరం టికెట్ ఇచ్చి.. తాండూరులో ఇటీవల పార్టీలో చేరిన మాజీ డీసీసీబీ ఛైర్మన్(DCCB CHAIRMEN) మనోహర్ రెడ్డిని బరిలో నిలిపారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద్, కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి జూబ్లీహిల్స్ స్థానాల నుంచి టికెట్ ఆశించారు. రెండు టికెట్లు కేటాయింపు సహా.. మైనార్టీలకు ఇచ్చే సీటు తగ్గుతుందని పార్టీ లెక్కలు వేసింది. చివరకు పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు అజారుద్దీన్ను జూబ్లీహిల్స్ బరిలో నిలిపింది.
Khairatabad Congress Ticket Issue : ఖైరాతాబాద్ సీటు కోసం విజయారెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పోటీ పడ్డారు. ఇక్కడ విజయారెడ్డికే టికెట్ ఇవ్వడం ద్వారా పీజేఆర్ కుటుంబంతో పాటు మహిళకు సీటు ఇచ్చినట్లు అవుతుందని భావించింది. ఖైరతాబాద్ టికెట్ ఆశించి.. చాలా కాలంగా నియోజకవర్గంలో పని చేసుకుంటూ వచ్చిన రోహిన్రెడ్డికి అంబర్పేట సీటు ఇచ్చింది. అంబర్పేట సీటు ఓబీసీ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్కు టికెట్ ఇవ్వొద్దంటూ.. సీనియర్ నేత హనుమంతురావు అధిష్ఠానానికి విన్నవించారు. సీఈసీ సమావేశంలోను రోహిన్రెడ్డి(Rohan Reddy) పేరును స్వయంగా సోనియాగాంధీ ప్రస్తావించడంతో.. ఆయనకు అంబర్పేట నుంచి టికెట్ ఇచ్చి పోటీ చేసేందుకు అవకాశం కలిపించినట్లు సమాచారం.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు నుంచి కంటోన్మెంట్ టికెట్ను ప్రజా గాయకుడు గద్దర్(Gaddar) కుటుంబానికి టికెట్ ఇచ్చి బరిలో దించాలని భావించారు. ఆ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితకు పోటీగా వెన్నెలను బరిలో దించారు. నారాయణపేట టికెట్ శివకుమార్ రెడ్డి ఆశించినప్పటికీ సాంకేతిక పరంగా ఎదురైన ఇబ్బందులతో ఆయన కోడలు చిట్టెం పర్నిక రెడ్డికి టికెట్ ఇచ్చారు. వనపర్తి సీటు మేఘారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిలల్లో ఎవరికి ఇవ్వాలన్న దానిపై లోతైన కసరత్తు జరిగింది. చివరకు చిన్నారెడ్డికే మొగ్గు చూపారు.
Palakurthi Congress TICKET Issue : పాలకుర్తి నుంచి ఝూన్సీ రెడ్డి, తిరుపతి రెడ్డి.. ఇద్దరు ఎన్ఆర్ఐలు టికెట్లు ఆశించారు. చాలా రోజులుగా నియోజక వర్గంలో పని చేసుకుంటూ వచ్చిన జాన్సిరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు పీసీసీ చొరవ చూపింది. ఐతే.. పౌరసత్వం విషయంలో తలెత్తిన ఇబ్బందితో ఆమె కోడలు మెమిడిల యశస్వినికి టికెట్ ఇచ్చారు. ఇలా ప్రతి సీటు విషయంలో స్థానిక బలాబలాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు తదితర వాటికి ప్రాధాన్యత ఇచ్చి.. గెలుపు, పార్టీకి విధేయతలను పరిగణనలోకి తీసుకుని టికెట్లు ఖరారులో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.