CM Revanth Reddy Delhi Tour Today : రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి(CM Revanth reddy) తొలిసారి ప్రధాని మోదీని కలవబోతున్నారు. నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి దిల్లీ వెళ్లనున్న ఆయన, సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పెద్దలను కలవనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో అధికారులదే కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth meet PM Modi in Delhi Tomorrow : రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీతో(PM Modi) సమావేశం అవుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఎటువంటి గొడవలు, బేషజాలకు పోకుండా సఖ్యతతో మెలగాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు.
అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై రేపు దిల్లీ పెద్దలతో సీఎం రేవంత్రెడ్డి చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో కష్టపడి పని చేసిన నాయకులు అంతా నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూస్తున్నారు. దీంతో యాభైకి పైగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సినవి ఉండడంతో పార్టీ కోసం పని చేసిన వారితో పాటు టికెట్లు త్యాగం చేసిన నాయకులకు కూడా పదవులు ఇచ్చేందుకు గత కొన్ని రోజులుగా పార్టీలో అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది.
రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు
Congress focus on Parliament Elections in Telangana : ఈ నేపథ్యంలో నేడు దిల్లీ వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎంలు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించనున్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ పదవులు, పార్లమెంటు ఎన్నికలు, లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఆసక్తి చూపుతున్న నాయకులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో 12కు తగ్గకుండా ఎంపీలు గెలిచేందుకు అవసరమైన కార్యాచరణ, ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర నాయకత్వం సమాయత్తం అవుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే మార్పు, కొత్తగా ఇంఛార్జి బాధ్యతలు దీపాదాస్ మున్సీకి అప్పగించడం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్ రెడ్డి