పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులతో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జూన్ 13న జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతి భవన్లో సమావేశం నిర్వహిస్తామన్నారు.
సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముందస్తు ప్రణాళిక సంస్కృతిని శాఖల యంత్రాంగం అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని సీఎం తెలిపారు. కరోనా తగ్గాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాజ్భవన్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం