కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు... రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ విజయవంతంగా అమలవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లోనూ అంతే పట్టుదలతో అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు... సామాజిక దూరాన్ని మించిన మార్గం లేదని పనురుద్ఘాటించారు. రాష్ట్రంలోని పరిస్థితిపై ప్రగతిభవన్లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మతో సమీక్ష నిర్వహించారు. పోలీసు, వైద్యశాఖల సీనియర్ అధికారులతో... ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సీఎం అభినందనలు..
లాక్డౌన్, కర్ఫ్యూల విషయంలో ప్రజల సహకారం కీలకమని, ఎక్కడా వెసులుబాట్లకు అవకాశం ఉండదని... వ్యాధిని నిర్మూలించేందుకు... రాష్ట్రం మరింత పట్టుదల చూపాలని దిశానిర్దేశం చేశారు. ఎవరికి అనుమానం కలిగినా.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు, వైద్యశాఖ సిబ్బంది, పారిశుద్ధ్య ఉద్యోగులను సీఎం అభినందించారు. విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెదిలిన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని అధికారులను కోరారు.
సామాజిక దూరం పాటించండి..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి విషయంలో, క్వారంటైన్లో ఉన్న వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లాక్డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతంపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలంతా ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరించి, సామాజిక దూరం పాటిస్తే ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్ట్రాన్ని, తద్వారా దేశాన్ని కాపాడవచ్చని సీఎం పిలుపునిచ్చారు.
కఠినంగా అమలు చేయండి..
లాక్డౌన్, కర్ఫ్యూలను కఠినంగా అమలు చేయాలని... అనుక్షణం నిఘా ఉంచాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. కర్ఫ్యూ సమయంలో ప్రతిరోజూ రాత్రి 7 గంటలలోపు దుకాణాలు మూసివేయకపోతే కేసులు నమోదు చేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ, లాక్డౌన్ను సరిగ్గా అమలు చేయకుంటే 24 గంటల కర్ఫ్యూ విధానం అమలు చేయాల్సి వస్తుందని పేర్కొంది. ఆస్పత్రులు, ఔషధాల వంటి అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని... సరకు రవాణా వాహనాలను అనుమతించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?