తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు. తొలి లేఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం సంతకం చేశారు. వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని లేఖల్లో పేర్కొన్నారు. గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్యారంగాలు, వ్యవసాయం, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను జగన్.. ప్రస్తావించారు.
తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలంటూ ఆయా కుటుంబాలను లేఖల ద్వారా సీఎం అభ్యర్థించారు. ఈ లేఖలను ఓటర్ల కుటుంబాలకు వైకాపా నేతలు అందించనున్నారు. ఈ లేఖలో ప్రతిపక్ష పార్టీల మీద ఎలాంటి విమర్శలు చేయకుండా 22 నెలల పరిపాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శినికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని తెలియజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: హనుమంతుడు పుట్టింది.. తిరుమలగిరులలోనే..!