కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ఏకైక మార్గం స్వీయ నియంత్రణ అని, దానిని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పాటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న సూచనలు తప్పకుండా పాటించి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధికి మందులు లేనందున ఆ వ్యాధి రాకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడం ఒకటే మార్గమని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తెరగాలన్నారు. చాలా దేశాలు నిర్లక్ష్యం చేయడం వల్ల తిరిగి పూడ్చుకోలేని నష్టాన్ని చవి చూశాయని భట్టి గుర్తుచేశారు.
అలాంటి దుస్థితి మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ రాకూడదని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వ్యాధి సంక్రమణకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణలే గొలుసుకట్టుకు అడ్డకట్ట వేయగలవని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చైనాను మించిన స్పెయిన్- ఒక్క రోజులో 738 మంది బలి