శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట కోదండరామాలయంలో మంగళవారం వైభవంగా అంకురార్పణ చేశారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి టి.మురళీధర్ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారు, ఉత్సవాల నిర్వాహకుడు కల్యాణపురం రాజేష్ భట్టర్ను తితిదే అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా, ఆలయ మర్యాదాలతో రామయ్య క్షేత్రానికి తీసుకొచ్చి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. కోదండరాముడికి రాజంపేట ఎమ్మెల్యే, తితిదే పాలకమండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. రాత్రి స్వామివారి శేష వాహన సేవ ఉంటుందని ఆయన తెలిపారు.