![Announcement of MLA Quota Candidates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17930627_s.jpg)
Announcement of MLA Quota Candidates for Council: రాష్ట్ర శాసన మండలి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులుగా చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా కేసీఆర్ సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్రెడ్డిలను కేసీఆర్ ఆదేశించారు. కాగా... రాష్ట్ర సర్కార్ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.
MLA Kota MLC Election Schedule : ఫిబ్రవరి 27న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నెల 29వ తేదీతో తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ మూడు స్థానాలు, ఏపీలో 7 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది.
![MLA Kota MLC Election Schedule](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17865963_mlc.jpg)
మార్చి 13 వరకు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఈ నెల 16 వ తేదీ వరకు గడువు ఉంటుంది. మార్చి 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజే సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ముగ్గురు అభ్యర్థుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నవీన్ కుమార్కు కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. గతంలో టీచర్గా చేసి ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించి ప్రస్తుతం సీఎం కార్యాలయం ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్కు కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. చాలా కాలంగా దేశపతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినప్పటికీ.. పలు సామాజిక, రాజకీయ సమీకరణల వల్ల గతంలో అవకాశం ఇవ్వలేదు.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు(కూతురి కొడుకు), చల్లా వెంకట్రామిరెడ్డి ఇటీవలే బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ విస్తరణలో చల్లా వెంకట్రామిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ తదితర పేర్లు కూడా ప్రచారం జరిగినప్పటికీ.. వారికి అవకాశం దక్కలేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అభ్యర్థుల విషయంలోను బీఆర్ఎస్ ఆచితూచి పరిశీలిస్తోంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి పేరును కేబినెట్ సిఫార్సు చేసినప్పుడు.. గవర్నర్ ఆమోదించలేదు. దీంతో ఇప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై బీఆర్ఎస్ ఆలోచిస్తోంది.
ఇవీ చదవండి: