జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ప్రతి యేటా భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమలదళపతి, హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం తెలంగాణను ఎంచుకున్నారు.
సోనాబాయ్ అనే గిరిజన మహిళకు భాజపా సభ్యత్వం
దిల్లీ నుంచి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా అక్కడే సీఐఎస్ఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం నేరుగా రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి మండలం రంగనాయక తండాకు 4 గంటలకు చేరుకున్నారు. సోనాబాయ్ అనే గిరిజన మహిళ ఇంటికి వెళ్లి ఆమెకు భాజపా సభ్యత్వాన్ని ఇచ్చారు. అమిత్ షా తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపిన సోనాబాయ్ అమిత్ షా కోసం రొట్టెలు, పప్పు, ఉప్మా చేసిపెట్టింది. తండాలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని తెలిపింది.
భాజపా తీర్థం పుచ్చుకున్న నాదెండ్ల
శంషాబాద్లోని కేఎల్సీసీ హాల్లో జరిగిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావుతో పాటు పలువురు నేతలు కమల కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని కమలదళపతి విమర్శించారు. భాజపా కుటుంబ పార్టీ కాదని భారతమాతను విశ్వగురువుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమించాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న 12 లక్షల సభ్యత్వాన్ని మరో 12 లక్షలకు పెంచాలని సూచించారు.
భాజపా ముఖ్యనేతలతో భేటీ
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముగించుకున్న అమిత్ షా నోవాటెల్ హోటల్లో భాజపా ముఖ్యనేతలలో సమావేశమయ్యారు. ప్రధానంగా సభ్యత్వ నమోదు, తెలంగాణలో పార్టీ బలోపేతం, 2023లో రాష్ట్రంలో అధికార కైవసంతో పాటు పార్టీలో ఇతర పార్టీల నాయకుల చేరికలపై సుమారు గంటకుపైగా చర్చించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి 9 గంటలకు దిల్లీ పయనమయ్యారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం: అమిత్ షా