రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని తెజస అధ్యక్షుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం విమర్శించారు. అధికారం అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా ఇసుకదందా, భూకబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రచారం నిర్వహించారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు చెల్లించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. పీఆర్సీ, రుణమాఫీ అమలుకు నోచుకోవడం లేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.
స్వార్థం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల్ని రీడిజైన్ చేసిందని అన్నారు. భూ దందాలను ఎదిరించిన న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతులను హత్య చేశారని ఆరోపించారు. మార్పు కోసం తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోదండరాం పట్టభద్రులను కోరారు.