భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం ప్రహరి తొలగించి.. పురపాలక శాఖ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదంగా మారింది. దశాబ్దాలకు పైగా ఎందరికో విద్యనందించి ఉన్నత శిఖరాలకు చేర్చిన పాఠశాల స్థలంలో ఆరు ఫీట్ల క్రీడా మైదానాన్ని తీసుకోవడం పట్ల విద్యార్థి సంఘాలు, పాఠశాల కమిటీ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంపై విద్యాశాఖకు ఫిర్యాదు చేశాయి.
స్పందించిన విద్యాశాఖ అధికారులు ఆ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనుమతులపై ఆరా తీయగా.. పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వరరావు కలెక్టర్ వద్ద అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల సమస్య అయినందున విద్యాశాఖ వద్ద అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా విద్యాధికారి సోమేశ్వర శర్మ స్పష్టం చేశారు. పనులు నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కోరతామని చెప్పారు.