భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇసుకవ్యాపారుల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా మణుగూరులోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక తోడేస్తున్న అక్రమార్కులు... కాసులు మూటగట్టుకుంటున్నారు. వర్షాకాలంలో గోదావరికి వరదలు వస్తాయని ముందే గ్రహించిన అక్రమార్కులు... కోట్లాది విలువైన ఇసుకను ముందే తీసి ఇసుక డంప్లు ఏర్పాటు చేసుకున్నారు. అనుకున్నట్టే దాదాపు 10 రోజుల పాటు భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తాయి.
భారీగా డంప్లు
మణుగూరు ప్రాంతంలో అనుమతి ఉన్న ర్యాంపులు మూడే అయినా... అనుమతి లేకుండా దాదాపు 10 చోట్ల ఇసుకను తీసి... వేలాది లారీల ఇసుకను స్థానిక గ్రామాల్లో నిల్వ చేశారు. ఒక్కో గ్రామంలో దాదాపు 300 నుంచి 400 వరకు ఇసుక డంప్లు ఉన్నాయి. ఉదయం ర్యాంపుల నుంచి ఇసుక తోడి... రాత్రి 11 తర్వాత యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. మణుగూరు మండలంలోని కొన్ని గ్రామాల పరిధిలో ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయిన ఇసుక డంప్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
కాసుల వర్షం..
మణుగూరు మండలంలోని రామానుజవరం, సాంబాయిగూడెం, కొండాయిగూడెం, మల్లెపల్లి గ్రామాల్లో దాదాపు వెయ్యి లారీల ఇసుక డంప్లు గుట్టలుగా పేరుకుపోయాయి. ర్యాంపుల దగ్గరి నుంచి తీసుకొచ్చి లారీల ద్వారా మూడు గ్రామాల పరిధిలో ఖాళీ ప్రదేశాలు, గుట్టల చాటున, జామాయిల్ తోటల మధ్య డంప్ చేశారు. అర్ధరాత్రి సమయంలో మణుగూరు నుంచి ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. ప్రస్తుతం మూడు గ్రామాల పరిధిలోని ఇసుక డంప్ల విలువ కోట్ల రూపాయల్లో ఉంది. ఈ ఇసుక రాజధానికి రవాణా జరిగితే ఇసుక వ్యాపారులకు మాత్రం కాసుల వర్షం కురిసినట్టే.
దూరంతోపాటే ధర కూడా..
ఈ ఇసుక డంప్ల్లో కొన్నిచోట్ల ఇప్పటికే తరలించినట్లు తెలుస్తోంది. దీని ధర ఖమ్మంలో ఒకలా, హైదరాబాద్ తరలిపోతే మరోలా ఉంటుంది. ఖమ్మంలో లారీ ఇసుక ధర రూ.60 వేల నుంచి రూ.70 వేలు... అదే హైదరాబాద్లో లక్ష నుంచి లక్షా 10 వేల వరకు ధర పలుకుతోంది. దూరం పెరిగినా కొద్దీ ఇసుక ధర విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా వారం పదిరోజుల్లోనే మణుగూరు ప్రాంతం నుంచి హైదబాదాద్కు దాదాపు రూ.6 కోట్ల వరకు, ఖమ్మం నగరానికి రూ.5 కోట్ల మేర ఇసుక తరలించినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ నేతల అండ..!
మణుగూరు ప్రాంతంలో జరిగే ఇసుక దందాకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉండే కొందరు నేతలు ఇసుక వ్యాపారులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక డంప్ చేసే సమయంలో, రవాణా చేసే క్రమంలో అంతా తామే అయి వ్యాపారులు నడిపిస్తున్నారని గుసగులాడుకుంటున్నారు. ఇసుక దందాకు అంగీకరించిన ప్రజాప్రతినిధులను లొంగదీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే వారిని భయపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇసుక తరలించే క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
కలెక్టర్ స్పందన..
మణుగూరులో ఇసుక అక్రమ రవాణాపై ఈటీవీ భారత్ కథనాలకు... జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి స్పందించారు. ఇసుక నిల్వలపై సమగ్ర విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని... రెవెన్యూ, గనుల శాఖ అధికారులను ఆదేశించారు. ఇంతకాలం కళ్లముందే ఇసుక దందా సాగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరించిన అధికార యంత్రాంగం మాత్రం కలెక్టర్ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెట్టడం విశేషం.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి