భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఇందిరానగర్లో గత సంవత్సరం 5 లక్షల 15 వేల రూపాయలు పెట్టి ఆరిఫా మోహినుద్దీన్ దంపతులు... అప్సర బేగం అనే మహిళకు చెందిన 3 పోర్షన్ల ఇంటిలో ఒక పోర్షన్ని గత సంవత్సరం జులై నెలలో కొనుగోలు చేశారు.
కాగా ఇళ్లు అప్పగించేందుకు కొంత సమయం కావాలని ఇంటి యజమాని అడిగింది. కాగా ఆమె చెప్పిన విధంగానే సమయం ఇవ్వగా మరికొంత సమయం అంటూ నెలల తరబడి.. ఇల్లు అప్పగించకుండా కాలయాపన చేస్తూ ఉండడం వల్ల గతంలో మనస్థాపానికి గురైన ఆరిఫా ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఇల్లు కొనుగోలు చేసినప్పుడు పూర్తి ఆధారాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నప్పటికీ తమకు ఇల్లు అప్పగించకుండా ఎక్కడైనా చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసి నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని.. అన్ని ఆధారాలు ఉండి కూడా తాము ఇల్లు పొందలేక.. ఇటు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నామని ఏకంగా కొనుగోలు చేసిన ఇంటి ముందు టెంట్ వేసి మరి నిరాహారదీక్ష చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని లేకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయం తెలుసుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రాము దీక్ష చేస్తున్న ప్రాంతానికి వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'సీఎం సారూ.. మేం చచ్చిపోతాం... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'