రహదారుల వెంబడి ఉండే చెత్త, పంట పొలాల్లోని గడ్డిని కొంతమంది కాల్చేస్తున్నారు. నిప్పు పెట్టి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోతుండటం వల్ల చివరికి బూడిదే మిగులుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై అగ్నిమాపక శాఖాధికారులు పదేపదే ప్రచారం నిర్వహిస్తున్నా కొందరిలో తీరు మారడం లేదు.
గడ్డిపోచలా తీసేయొద్ధు.!
వరిగడ్డి తరలించేటప్పుడు చిన్న నిర్లక్ష్యం పెను ప్రమాదాన్ని సృష్టిస్తోంది. పైన విద్యుత్తు లైన్లను ఆనుకుని నిప్పు రవ్వలు ఎగిసిపడి గడ్డితోపాటు వాహనాలు సైతం బుగ్గవుతున్నాయి. అంతేకాదు సమీప ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలకు కారణభూతం అవుతున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వేసవి కాలం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్ధు ఆరుబయట చెత్తకు నిప్పు పెట్టడం వంటి పనులు చేయరాదు. ఎక్కడైనా నిప్పు వ్యాపిస్తే వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలి.
- రాజయ్య, ఖమ్మం అగ్నిమాపక కేంద్ర అధికారి
పల్లెల్లో పాటించాల్సిన జాగ్రత్తలు
- పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేయాలి
- గడ్డివాముల నుంచి నివాసగృహములకు తప్పనిసరిగా 60 అడుగుల దూరాన్ని పాటించాలి
- పెద్ద గడ్డివాములకు బదులు చిన్న వాటిని నిర్మించాలి
- గుడిసె, గుడిసెకు మధ్య 30 అడుగుల దూరం ఉండాలి.
- ఏ విధమైన బహిరంగ మంటలను అనుమతించకూడదు.
- వంట వండగానే పొయ్యిలను ఆర్పివేయాలి.
- అగ్ని నుంచి రక్షణ కోసం తగినన్ని నీటిని నిల్వ చేసుకోవాలి.
పంట వ్యర్థాల కాల్చివేతతో నష్టమే..
పంటలు పండించటం పూర్తయిన తర్వాత పంట వ్యర్థాలను కాల్చటం మంచిది కాదు. దీనివల్ల భూమి లోపల ఉన్న సేంద్రియ పదార్థం తగలబడి నేలలో సత్తువ తగ్గుతుంది. రోటావేటర్తో గానీ లేదా మల్టీపర్పస్ క్రాప్ షడ్లర్తో గానీ పంట వ్యర్థాలను ముక్కలు, ముక్కలు చేసి భూమిలోపల కలియ దున్నాలి. ఇలా చేయటం వల్ల భూమికి కావాల్సినంత సేంద్రియ పదార్థం అందుతుంది. తద్వారా భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగడంతోపాటు సాగు చేసిన పంట బెట్టను సైతం తట్టుకునే అవకాశం ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు మారి తర్వాత వేసే పంట పెరుగుదల చాలా బాగుంటుంది. భూమిలో కర్బన శాతం కూడా పెరుగుతుంది.
- డా.జే.హేమంత్కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్, వైరా కేవీకే