భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల ఎంపీడీవో కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యసొసైటీలు, మండల ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమానేశం వాడీవేడిగా జరిగింది. ఈ మేరకు మత్స్యశాఖ ఆధ్వర్యంలోని సొసైటీలపై పంచాయతీ ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
!['మత్స్యసంపద ఆదాయం సొసైటీలకే.. పంచాయితీలకు కాదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8829668_512_8829668_1600312155633.png)
తగిన ఆదాయం లేదు : పంచాయతీ
పంచాయతీలకు తగిన ఆదాయం రాకుండా మత్స్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆరోపించారు. చెరువులు, కుంటల వేలం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను కోరారు.
నిబంధనల ప్రకారమే..
స్పందించిన జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి, నిబంధనల ప్రకారమే సభ్యుల నియామకం.. చెరువులు, కుంటల కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. మత్స్యసొసైటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులకే తొలి హక్కు అని.. ఇల్లెందు పూర్తి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి గిరిజనులు మాత్రమే సొసైటీలకు అర్హులని జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సొసైటీ సభ్యులుగా ఎంపిక కావాలంటే ఆయా పంచాయతీ నివాసితో పాటు అదే పంచాయతీ పరిధిలోనే ప్రభుత్వ గుర్తింపు పత్రం ఉండాలని పేర్కొన్నారు.
సుమారు 10లక్షల చేప పిల్లల పంపిణీ..
ఈ క్రమంలో చెరువులు, కుంటలపై గ్రామ పంచాయతీలకు కాకుండా గిరిజనులకు మాత్రమే అవకాశాలు ఉంటాయన్నారు. గతంలో ఇల్లెందు మండల పరిధిలో రెండు దఫాలుగా సుమారు 10 లక్షలకు పైగా ఉచిత చేపపిల్లలను ప్రభుత్వం పంపిణి చేసిందని జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి వివరించారు.
!['మత్స్యసంపద ఆదాయం సొసైటీలకే.. పంచాయితీలకు కాదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8829668_1014_8829668_1600312090829.png)
వద్దు అనుకుంటేనే వేలం..
ఏటా ప్రభుత్వం సూచించిన నామమాత్రపు ధరను ఆయా సొసైటీలు గ్రామ పంచాయతీలకు చెల్లించాలని ఆయన సూచించారు. ఒక వేళ కార్యవర్గం తమకు సొసైటీ వద్దు అనుకుంటే పంచాయితీ నోటీస్ ద్వారా చెరువులు, కుంటలను బహిరంగ వేలం వేస్తామన్నారు.
అనర్హుల చేతుల్లో వాహనాలు..
మత్స్య శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన మోపెడ్ వాహనాలు, ఫిష్ ఔట్లెట్లును అనర్హులు పొందారని కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ నాగరత్నమ్మ, ఎంపీడీవో అప్పారావు, వైస్ ఎంపీపీ ప్రమోద్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.