మొక్కజొన్న పంటపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. తెరాస ప్రభుత్వం మొక్కజొన్న పంటను వేయకుండా ఇతర పంటలు వేయాలని సూచించడం సరైనది కాదని మండిపడ్డారు.
రైతులను ఇబ్బంది పెడుతున్నారు
ఇల్లందు పట్టణంలోని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో అఖిలపక్ష నేతలు సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చించారు. సీఎం కేసీఆర్ మొక్కజొన్న పంట వేయకుండా ఇతర పంటలను సాగు చేయాలని రైతులను ఆదేశించి.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత మధు ఆరోపించారు. ఆదివాసి గిరిజన ప్రాంతంలో ఏజన్సీ రైతులు మొక్కజొన్న పంటను ప్రధాన పంటగా సాగు చేస్తుంటారని.. ఈ భూములు మొక్కజొన్నకు అనుకూలంగా ఉంటాయని స్పష్టం చేశారు.
ఇతర పంటలు సాగు చేస్తే నష్టం
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకువచ్చేందుకు.. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ధ్వజ మెత్తారు. గిరిజన రైతులను దృష్టిలో ఉంచుకొని మొక్కజొన్న సాగుకు చోటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడి భూముల్లో ఇతర పంటలు సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్ట పోతారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఒకే ఇంట్లో నలుగురికి కరోనా